గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ గెలుపు

Gujarat Fortunegiants End Six Match Losing Streak - Sakshi

చెన్నై: డబుల్‌ హ్యాట్రిక్‌ ఓటములకు గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 29–26తో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. రోహిత్‌ గులియా సూపర్‌ ‘టెన్‌’తో చెలరేగాడు. 10–3తో వెనుకబడి ఉన్న గుజరాత్‌ను తన రైడింగ్‌ నైపుణ్యంతో రోహిత్‌ గెలిపించాడు. పట్నా రైడర్‌ ప్రదీప్‌ నర్వాల్‌ తన డుబ్కీ రైడ్‌తో సాధించిన ‘సూపర్‌ రైడ్‌’ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో యు ముంబా జట్టు 29–24తో తమిళ్‌ తలైవాస్‌పై విజయం సాధించింది. మొదటి అర్ధభాగంలో వెనుకంజ వేసినా రెండో అర్ధ భాగంలో పుంజుకున్న ముంబై ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే జోరును చివరి వరకు కొనసాగించిన ముంబై విజయాన్ని ఖాయం చేసుకుంది. ఆ జట్టు రైడర్‌ అతుల్‌ 7 పాయింట్లతో రాణించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో దబంగ్‌ ఢిల్లీతో బెంగళూరు బుల్స్‌... జైపూర్‌ పింక్‌పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్‌ తలపడతాయి.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top