సెమీస్‌లో గాయత్రి, సిరిల్‌ వర్మ

Gayatri, Siril Varma enter semis of All India Badminton Championship - Sakshi

ఆలిండియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: యోనెక్స్‌ సన్‌రైజ్‌ ఆలిండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారులు పుల్లెల గాయత్రి, ఎ. సిరిల్‌ వర్మ సెమీస్‌కు దూసుకెళ్లారు. గచ్చిబౌలిలోని గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో సిరిల్‌ వర్మ 21–18, 21–11తో ఆలాప్‌ మిశ్రా (మధ్యప్రదేశ్‌)పై, రాహుల్‌ యాదవ్‌ (తెలంగాణ) 22–20, 21–15తో శ్రీరామ్‌ (కర్ణాటక)పై గెలిచారు.

మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో గాయత్రి 23–21, 21–9తో శైలి రాణే (రైల్వేస్‌)పై నెగ్గగా, మూడోసీడ్‌ సాయి ఉత్తేజిత రావు (ఏపీ) 21–12, 21–11తో ఆషి రావత్‌ (ఢిల్లీ)ని ఓడించింది. డబుల్స్‌ విభాగాల్లో మేఘన జక్కంపూడికి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల (ఎయిరిండియా)–మేఘన (ఆర్‌బీఐ) జంట 21–12, 21–11తో హేమనాగేంద్ర బాబు (రైల్వేస్‌)– నింగ్షి హజారికా (అస్సాం) జోడీపై నెగ్గింది. మహిళల డబుల్స్‌లో మేఘన–పూర్విషా రామ్‌ (ఆర్‌బీఐ) జంట 5–21, 19–21తో అపర్ణ బాలన్‌–కె. శ్రుతి జోడీ చేతిలో ఓడింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top