భారత్‌ ‘పంచ్‌’ పవర్‌ 

Five Indian Boxers Qualified For Tokyo Olympics - Sakshi

టోక్యో ఒలింపిక్స్‌కు ఐదుగురు భారత బాక్సర్లు వికాస్, ఆశిష్, సతీశ్, పూజ, లవ్లీనా అర్హత

అమ్మాన్‌ (జోర్డాన్‌): క్వార్టర్‌ ఫైనల్‌ అడ్డంకిని అధిగమిస్తూ భారత బాక్సర్లు వికాస్‌ కృషన్‌ (69 కేజీలు), ఆశిష్‌ కుమార్‌ (75 కేజీలు), సతీశ్‌ కుమార్‌ యాదవ్‌ (ప్లస్‌ 91 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్‌ (69 కేజీలు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఇక్కడ జరుగుతున్న ఆసియా క్వాలిఫయింగ్‌ టోర్నీలో పురుషుల      విభాగంలో వికాస్, ఆశిష్, సతీశ్‌... మహిళల విభాగంలో పూజా రాణి, లవ్లీనా సెమీఫైనల్‌ చేరుకొని ‘టోక్యో’ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో వికాస్‌ 3–2తో సెవోన్‌రెట్స్‌ ఒకజవా (జపాన్‌)ను ఓడించగా... ఆశిష్‌ 5–0తో ముస్కితా (ఇండోనేసియా)పై... సతీశ్‌ 5–0తో దైవీ ఒట్కోన్‌బాయెర్‌ (మంగోలియా)పై గెలిచారు. పూజా రాణి 5–0తో పోర్నిపా చుటీ (థాయ్‌లాండ్‌)పై, లవ్లీనా 5–0తో మెలియెవా (ఉజ్బెకిస్తాన్‌)పై నెగ్గారు. పురుషుల 81 కేజీల విభాగం క్వార్టర్‌ ఫైనల్లో సచిన్‌ కుమార్‌ చైనా బాక్సర్‌ డాక్సియాంగ్‌ చెన్‌ చేతిలో ఓడిపోయాడు. విజేందర్‌ తర్వాత భారత్‌ తరఫున మూడోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన రెండో బాక్సర్‌గా వికాస్‌ కృషన్‌ గుర్తింపు పొందగా... ఆశిష్, సతీశ్, పూజా రాణి, లవ్లీనా తొలిసారి ఒలింపిక్స్‌ బరిలో నిలువనున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top