ఇకపై ఏటా ‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్’
కేంద్ర క్రీడల మంత్రి రాథోడ్
న్యూఢిల్లీ: జాతీయ క్రీడల్లాగే ఇకపై ‘ఖేలో ఇండియా’ స్కూల్, కాలేజ్ గేమ్స్ నిర్వహిస్తామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వెల్లడించారు. ఈనెల 6 నుంచి జరుగనున్న ఫిఫా అండర్–17 ప్రపంచకప్లో పాల్గొనే భారత ఫుట్బాల్ జట్టును మంగళవారమిక్కడ సన్మానిం చారు. ఈ సందర్భంగా రాథోడ్ మాట్లా డుతూ ‘దేశ క్రీడల ముఖచిత్రాన్ని మార్చనున్నాం. అందరి సహకారంతో క్రీడల్లో భారత్ను మరో దశకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాం. కుర్రాళ్లు చిరు ప్రాయంలోనే క్రీడలను కెరీర్గా ఎంచుకునేందుకు చక్కని ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో భాగంగా తొలిసారిగా ఈ ఏడాది ‘ఖేలో ఇండియా’ జాతీయ స్కూల్ గేమ్స్ను ఈ డిసెంబర్లో నిర్వహిస్తాం. అలాగే కాలేజ్ గేమ్స్ను వచ్చే జనవరిలో నిర్వహిస్తాం. ఇకపై క్రమం తప్పకుండా ప్రతిఏటా ఈ గేమ్స్ నిర్వహణకు చర్యలు తీసుకుంటాం.
తద్వారా పాఠశాల, కళాశాల స్థాయిలో ప్రతిభగల క్రీడాకారులను వెలుగులోకి తెస్తాం’ అని అన్నారు. ఆసియా గేమ్స్, పాన్ అమెరికా గేమ్స్లా ఈ ఈవెంట్లను ఘనంగా నిర్వహిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. పలు కార్పొరేట్ సంస్థల సౌజన్యంతో అట్టహాసంగా నిర్వహించే ఈ క్రీడలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం 1000 మంది విద్యార్థులను ఎంపిక చేసి తదుపరి ఉత్తమ శిక్షణకు రూ. 5 లక్షలు చొప్పున ఎనిమిదేళ్ల పాటు ఇస్తామన్నారు. భారత ఫుట్బాలర్లను ఉద్దేశించి ‘మైదానంలోకి దిగాక మీరు ఈ మ్యాచే మీ కెరీర్ చివరిదన్నట్లు పోరాడండి. మీరు ఈ స్థాయికి రావడానికి పడిన కష్టాలను గుర్తుకుతెచ్చుకోండి. అప్పుడే అసాధారణ ఫలితాలు సాధిస్తారు’ అని ఉత్తేజపరిచారు.