
టీమిండియాపై ఇంగ్లండ్ ఘనవిజయం
ముక్కోణపు సిరీస్ లో టీమిండియాపై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది.
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా టీమిండియాతో ఇక్కడ జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ విసిరిన 154 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 27.3 ఓవర్లలో ఛేదించిన ఇంగ్లండ్ రన్ రేట్ ను కూడా మెరుగుపరుచుకుంది. ఆదిలో మహ్మద్ అలీ(8) వికెట్ ను ఇంగ్లండ్ కోల్పోయినా.. ఇయాన్ బెల్(86), జేమ్స్ టేలర్ (56) లు చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ఆడి ఇంగ్లండ్ ఘన విజయంలో పాలుపంచుకున్నారు. టీమిండియా బౌలర్లలో స్టువర్ట్ బిన్నీకి మాత్రమే వికెట్ దక్కింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 153 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఆదిలో శిఖర్ ధావన్(1) వికెట్ కోల్పోయిన టీమిండియా ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(34), స్టువర్ట్ బిన్నీ (44), అజ్యింకా రహానే(33), అంబటి రాయుడు(23) పరుగులు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్ ఐదు వికెట్లుతీసి టీమిండియా పతనాన్ని శాసించగా, అండర్ సన్ కు నాలుగు వికెట్లు దక్కాయి.