
ఢాకా: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన బంగ్లాదేశ్ చివరిదైన మూడో వన్డేలో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను ఓడించి 2–1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఓపెనర్ షై హోప్ (131 బంతుల్లో 108 నాటౌట్; 9 ఫోర్లు, సిక్స్) అజేయ శతకంతో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 198 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లు మెహదీ హసన్ (4/29), షకీబ్ (2/40), మోర్తజ (2/32) ధాటికి విండీస్ బ్యాట్స్మెన్ విలవిల్లాడారు. అనంతరం తమీమ్ ఇక్బాల్ (81 నాటౌట్; 9 ఫోర్లు), సౌమ్య సర్కార్ (80; 5 ఫోర్లు, 5 సిక్స్లు) రాణించడంతో బంగ్లాదేశ్ 38.3 ఓవర్లలో 2 వికెట్లకు 202 పరుగులు చేసి గెలిచింది.