రజతాలు నెగ్గిన గుర్ప్రీత్, సునీల్
జియాన్ (చైనా): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్ల పతకాల వేట కొనసాగుతోంది. శనివారం జరిగిన పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో గుర్ప్రీత్ సింగ్ (77 కేజీలు), సునీల్ (87 కేజీలు) రజత పతకాలు గెల్చుకున్నారు. ఫైనల్లో గుర్ప్రీత్ 0–8తో హైనోవూ కిమ్ (కొరియా) చేతిలో... సునీల్ 0–2తో హుస్సేన్ అహ్మద్ నూరీ (ఇరాన్) చేతిలో ఓడిపోయారు. అంతకుముందు సెమీఫైనల్స్లో గుర్ప్రీత్ 6–5తో షదుకయెవ్ (కజకిస్తాన్)పై, అజామత్ (కజకిస్తాన్)పై సునీల్ గెలుపొందారు.
క్వార్టర్ ఫైనల్స్లో గుర్ప్రీత్ 10–0తో షరీఫ్ బాదర్ (ఖతర్)పై, సునీల్ 14–7తో ఒఖోనోవ్ (తజికిస్తాన్)పై నెగ్గారు. మరోవైపు 130 కేజీల విభాగం కాంస్య పతక పోరులో ప్రేమ్ కుమార్ 0–5తో దామిర్ కుజుమ్బయేవ్ (కజకిస్తాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. 55 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో మంజీత్ 3–5తో సులైమనోవ్ (కిర్గిస్తాన్) చేతిలో... 63 కేజీల క్వార్టర్ ఫైనల్లో విక్రమ్ 0–8తో జిన్వూంగ్ జంగ్ (కొరియా) చేతిలో పరాజయం పాలయ్యారు.
మరిన్ని వార్తలు