‘చంద్రబాబు హామీలు నీటి మీద రాతలు’

Vijaya Sai Reddy Slams Chandrababu And Pawan Kalyan - Sakshi

సాక్షి, వైఎస్సార్‌‌: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు హామీలు నీటి మీద రాతలేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి విమర్శించారు. మంగళవారం వైఎస్సార్‌ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట సభల కోసం చివరికి టీటీడీ బస్సులను కూడా వాడుకుంటున్నారని మండిపడ్డారు. వాటిలో మాంసం, మద్యం సరఫరా చేస్తున్నారని.. ఇది క్షమించరాని పాపమని అన్నారు. దీనికి చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.  చంద్రబాబు ప్రభుత్వం తాత్కాలికమేనని.. ప్రభుత్వ అధికారులు టీడీపీ నాయకులకు వత్తాసు పలకడం సరికాదని హితవు పలికారు. ఉపాధి హామీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి.. చంద్రబాబు అక్రమాలకు సహకరించి అధికారులు ఇబ్బందిపడొద్దని సూచించారు.

చంద్రబాబు ప్రభుత్వ అవినీతి హిమాలయ శిఖర స్థాయికి చేరిందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు అక్రమాలపై విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సగానికి పైగా మండలాల్లో కరువు ఉంటే.. ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. తొలి నుంచి బీజేపీని విమర్శించి.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసింది వైఎస్సార్‌ సీపీ మాత్రమేనని గుర్తుచేశారు. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసిన చంద్రబాబు నేడు పోరాటం అంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ తాము ఎట్టి పరిస్థితుల్లో జతకట్టేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో వైఎస్సార్‌ సీపీ ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదని వెల్లడించారు. ప్రజలు తప్పకుండా టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేయండని పిలుపునిచ్చారు. 

కాల్‌ షీట్లు ఇచ్చినట్టు పవన్‌ పర్యటనలు..
పోలవరం పనులను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 16 వేల కోట్లతో ప్రారంభించారని తెలిపారు. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును.. చంద్రబాబు ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు. ప్రాజెక్టు అంచనాలు పెంచుకుని.. అవినీతి సొమ్ము జేబులో వేసుకునేందుకే చంద్రబాబు పోలవరం నిర్మాణం చేపడుతున్నట్టు ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 24 గంటలు, 365 రోజులు ప్రజల్లో ఉండే వ్యక్తి అని అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సినిమాకు కాల్‌ షీట్లు ఇచ్చినట్టు పర్యటనలు చేస్తున్నారని తెలిపారు. కేవలం వైఎస్సార్‌ హయంలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని గుర్తుచేశారు. సోషల్‌ మీడియా వాలంటీర్లపై అక్రమ కేసులు పెడుతున్నారని.. సుప్రీం ఆదేశాలను ఉల్లఘించి ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. వారికి వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

ఉక్కు పరిశ్రమ నిర్మిస్తాం
13 జిల్లాల్లో పార్టీని పటిష్ట పరిచేందుకు పర్యటనలు చేస్తున్నామని వెల్లడించారు. బూత్‌ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. రాయలసీమ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఉక్కు పరిశ్రమ విషయంలో చంద్రబాబు దోబూచులాడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌ మరికొంత కాలం ఉండి ఉంటే ఉక్కు కల సాకారం అయ్యేదని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top