గులాబీ గూటికి ఉమా మాధవరెడ్డి  | Uma madhava reddy to the TRS | Sakshi
Sakshi News home page

గులాబీ గూటికి ఉమా మాధవరెడ్డి 

Dec 13 2017 1:08 AM | Updated on Aug 15 2018 9:40 PM

Uma madhava reddy to the TRS - Sakshi

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమైన ఉమా మాధవరెడ్డి, సందీప్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు జగదీశ్‌ రెడ్డి, హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: టీటీడీపీ సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి గులాబీ గూటికి చేరనున్నారు. గత కొన్నాళ్లుగా ఆమె టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. మంగళవారం ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు, భువనగిరి జిల్లా టీటీడీపీ అధ్యక్షుడు సందీప్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేయాలనే తమ మనోగతాన్ని వెల్లడించారు. ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటలకు తమ అనుచరులతో కలసి తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. గత నెలలోనే ఆమె సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీలో కలిశారు. మావోయిస్టుల చేతుల్లో హత్యకు గురైన తన భర్త, మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డికి ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించినా, అప్పజెప్పలేదని వినతి పత్రం ఇచ్చేందుకే వచ్చినట్లు అప్పట్లో చెప్పారు.

టీఆర్‌ఎస్‌లో చేరాలనే ఎలాంటి ఆహ్వానం లేదని, ఆహ్వానిస్తే ఆలోచిస్తానని పేర్కొన్నారు. ఇది జరిగి నెల గడవక ముందే టీఆర్‌ఎస్‌లో చేరడం ఖరారైంది. రాష్ట్రంలో టీడీపీ పనైపోయిందన్న అభిప్రాయంతో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల సమయంలోనే టీఆర్‌ఎస్‌ ఆహ్వానించినా టీడీపీ నుంచి రాలేదు. ఆ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన తనయుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు పలువురు విశ్లేషిస్తున్నారు. అయితే భువనగిరిలో టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్నందున ఆమెకు, ఆమె కుమారుడికి ఏ హామీ ఇస్తారన్నది తేలాల్సి ఉంది. కాగా, గురువారం తెలంగాణ భవన్‌లో భారీ సంఖ్యలో తమ అనుచరులతో కలసి పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement