వీళ్లు ప్రచారం చెయ్యొచ్చా? | Sakshi
Sakshi News home page

వీళ్లు ప్రచారం చెయ్యొచ్చా?

Published Mon, Apr 1 2019 12:04 PM

TTD Employees Campaign For TDP Leaders in Chittoor - Sakshi

సాక్షి, చిత్తూరు, తిరుపతి: ఇన్నాళ్లూ అధికార పార్టీ సేవలో తరించిన ప్రభుత్వ, టీటీడీ అధికారులు ఇప్పుడు కూడా స్వామి భక్తి చాటుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అభ్యర్థుల కోసం ప్రభుత్వ, టీటీడీ అధికారులు ప్రచారం చేస్తున్నారు. మరికొందరు అధికారులు తన నివాసంలో ఆయా సామాజిక వర్గం వారిని పిలిపించి సమావేశాలు ఏర్పాటు చేసి టీడీపీకి ఓటెయ్యాలని ఒత్తిడి తెస్తున్నారు. తిరుపతి టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ కోసం టీటీడీ ఉద్యోగి కేశవ నారాయణ ఆదివారం నగరంలో ప్రచారంలో పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ డిప్యూటీ ఈఓ ఒకరు తన నివాసంలో ఆయన సామాజికవర్గం వారితో సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీకి ఓటెయ్యాలని, తాను పదవిలో ఉన్నప్పుడు మీకు ఎన్నో చేశానని చెప్పినట్లు సమాచారం.

కాగా సమావేశానికి హాజరైన వారు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే  పీలేరులో ఫీల్డ్‌ అసిస్టెంట్, టెక్నికల్‌ అసిస్టెంట్లు టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి కుమారుడితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మదనపల్లి, చంద్రగిరి తదితర ప్రాంతాల్లో కొందరు అధికారులు మెప్మా సిబ్బందిపై ఒత్తిడి చేసి ఎన్నికల ప్రచారం చేయిస్తున్నారు. రుణాలు, రేషన్‌కార్డులు మెలిక పెట్టి ఓటర్లపై ఒత్తిడి తెస్తున్నారు. నాలుగు రోజుల కిందట కొందరు టీటీడీ ఉద్యోగ సంఘాల నేతలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినందుకే ఉన్నతాధికారులు వారిపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. మరి నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని టీటీడీ ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement