‘ఎన్టీఆర్ స్థాపిస్తే... చంద్రబాబు స్టెప్నీగా మార్చారు’ | TDP Is Telugu Congress Party, Says GVL Narasimha Rao | Sakshi
Sakshi News home page

‘ఎన్టీఆర్ స్థాపిస్తే... చంద్రబాబు స్టెప్నీగా మార్చారు’

Apr 12 2018 7:12 PM | Updated on Mar 23 2019 9:10 PM

TDP Is Telugu Congress Party, Says GVL Narasimha Rao - Sakshi

సాక్షి, విజయవాడ : గత నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా ఊసేత్తని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనూహ్యంగా యూటర్న్ తీసుకుని తాము సైతం పోరాడుతున్నట్లు నటించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూ తీవ్ర విమర్శల పాలవుతున్నారు. తాజాగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఏపీ సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో గురువారం ఇక్కడి మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకొచ్చాక చంద్రబాబు చేసిన మోసాలు, అవకతవకలు బయటకొస్తుంటే హోదా ముసుగులో డ్రామాలాడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి దేశంలోని 21 రాష్ట్రాల్లో అధికారం కట్టబెట్టారని గుర్తుచేశారు. 

అప్రజాస్వామిక లక్షణాలున్న పార్టీ కాంగ్రెస్ అని, అందుకే జాతీయస్థాయిలో కాంగ్రెస్ తన ఉనికి కోల్పోతుందన్నారు. 'ఏపీలో అనేక కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి.. అవి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయి. టీడీపీని తెలుగుదేశం అనడం కంటే తెలుగు కాంగ్రెస్ పార్టీ అనడం మంచిది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దివంగత సీఎం ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే... చంద్రబాబు మాత్రం కాంగ్రెస్‌కు స్టెప్నిగా మార్చారు. కాంగ్రెస్‌తో జతకలిసి ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాలను సరిగా జరగనివ్వలేదు. ప్రత్యేక హోదా వస్తే ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో.. వాటినే ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఇచ్చాము. టీడీపీలాగా బీజేపీ రోజుకొక మాట మాట్లాడదు. బీజేపీ ఆంద్రప్రదేశ్‌కి అన్యాయం చేసిందని విష ప్రచారం చేస్తున్నారని' జీవీఎల్ విమర్శించారు. 

ఈ కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టి... ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న నిరసన దీక్షను అడ్డుకోవాలని కుట్రలు చేశారని ఆరోపించారు. రౌడీ రాజకీయాలను పార్లమెంట్ లొనే అనుకున్నా. రోడ్డు మీదకు కూడా తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అవకతవకలు రోజుకోకటి బయటకు వస్తున్న వాటికి సమాధానం చెప్పకుండా ప్రత్యేక హోదా ముసుగులో డ్రామాలు ఆడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం 750 కోట్ల రూపాయాలు ఖర్చుపెట్టి ఎవరికీ కనిపించని భవనాలు కట్టింది. గుంటూరు జిల్లా రూరల్‌లో టీడీపీ విద్యార్థి విభాగం బీజేపీ కార్యాలయంపై దాడి చేయడాన్ని జీవీఎల్ నరసింహారావు తీవ్రంగా ఖండించారు.

Advertisement
 
Advertisement
Advertisement