కన్నా లక్ష్మీ నారాయణపై చెప్పుల దాడి
సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణపై చెప్పుల దాడి జరిగింది. బుధవారం నెల్లూరు జిల్లాలో కావలిలో ర్యాలీ నిర్వహిస్తున్న ఆయనపై తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు చెప్పులు విసిరారు. దీంతో బీజేపీ కార్యకర్తలు అతడిని చితకబాదారు.
పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలిస్తున్నా, వెంబడించి మరీ చావబాదారు. అనంతరం చెప్పుల దాడికి నిరసనగా నిరసనగా బీజేపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. రాష్ట్రంలో టీడీపీ రౌడీయిజాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. కాగా, చెప్పుల దాడి ఘటనపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. టీడీపీ నేతలు కొరివితో తల గోక్కుంటున్నారని హెచ్చరించారు.
తన ఇంటిపైకి కూడా టీడీపీ నాయకులు రౌడీలను పంపిస్తున్నారని ఆరోపించారు. హోం మంత్రి, డీజీపీ, గవర్నర్లను ఈ విషయంపై కలిశామని గుర్తు చేశారు. రాష్ట్రానికి నాలుగేళ్లలో ఏం చేశామనే విషయాన్ని ప్రజలకు చెప్పడానికే పర్యటన చేస్తున్నట్లు వెల్లడించారు. పర్యటన విజయవంతం అయితే ఓడిపోతామని భయపడుతున్న చంద్రబాబు ఇలాంటి దాడులకు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.