చంద్రబాబు సవాల్‌కు వీర్రాజు సై | somu veerraju respond on chandrababu challenge | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సవాల్‌కు వీర్రాజు సై

Feb 18 2018 4:41 PM | Updated on Aug 20 2018 9:26 PM

somu veerraju respond on chandrababu challenge - Sakshi

సాక్షి, విజయవాడ: కేంద్ర సాయంపై బహిరంగ చర్చ సిద్ధమని సీఎం చంద్రబాబు చేసిన సవాల్‌పై బీజేపీ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు. టీడీపీతో బహిరంగ చర్చకు సిద్ధమేనని ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఎప్పుడు చేయనంత సాయం కేంద్రం చేస్తోందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబును పిలిస్తే లెక్కలన్నీ చెబుతారన్నారు. హరిబాబు సినిమా స్క్రిప్టులు చదువుతారంటూ విమర్శిస్తున్నారని, ఆ అలవాటు మాది కాదు మీదంటూ టీడీపీ నాయకులపై మండిపడ్డారు. అమరావతితో పాటు విజయవాడ అభివృద్ధికి కేంద్రం ఎన్నో నిధులిచ్చిందన్నారు. విశాఖపట్నంలో రోడ్లు మెరవడానికి కేంద్రం నిధులే కారణమని వెల్లడించారు. అమరావతికి రూ. 20 వేల కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నామని వివరించారు.

కావాలనే దుష్ప్రచారం..
ఏపీని కేంద్రం అన్నివిధాల ఆదుకుంటోందని, టీడీపీ నాయకులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కంభంపాటి హరిబాబు అన్నారు. రెవెన్యులోటు పూడ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీయే పాటుపడుతోందని చెప్పుకొచ్చారు.

కేంద్రం సాయంపై డాక్యుమెంట్‌
ఆదివారం జరిగిన బీజేపీ విస్తృతస్థాయి సమావేశానికి దగ్గుబాటి పురందేశ్వరి, గోకరాజు రంగరాజు, కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావు హాజరయ్యారు. టీడీపీ నేతల విమర్శలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ఏపీకి కేంద్రం సాయంపై డాక్యుమెంట్‌ రూపొందించారు. ఏపీలో ప్రాజెక్టులు, కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను ఇందులో పొందుపర్చారు.

Advertisement
 
Advertisement
Advertisement