బాదామి మాటెత్తలేదు | Siddaramaiah denies planning to contest from Badami | Sakshi
Sakshi News home page

బాదామి మాటెత్తలేదు

Apr 17 2018 7:51 AM | Updated on Sep 5 2018 1:55 PM

Siddaramaiah denies planning to contest from Badami - Sakshi

మైసూరు: తాను బాదామి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఎక్కడ ఎప్పుడూ చెప్పలేదని, ఇప్పటివరకు తాను రెండు నియోజకవర్గాల్లో  పోటీ చేయలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సోమవారం ఉదయం మైసూరులో మండకళ్ళి విమానాశ్రయంలో మీడియాతోసీఎం మాట్లాడుతూ తాను బాదామి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పలేదని, అంతా మీడియా సృష్టించిందేనని, ఎప్పుడూ కూడా తాను రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయలేదని అన్నారు. తాను చాముండేశ్వరి నియోజకవర్గం నుంచే పోటి చేస్తున్నానని, ఈ నెల 20వ తేదిన నామినేషన్‌ కూడా వేస్తానని అన్నారు. టికెట్ల పంపిణీ విషయంలో కొంతమందికి అసహనం కలగడం వాస్తవమేనని, అలాంటి వారిని పిలిచి మాట్లాడతానని, ఈ నెల 20వ తేదీ తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని అన్నారు.

చాముండిలో గెలుపు నాదే
సీఎం సిద్ధరామయ్య ఒక నెల పూర్తిగా రామనగర, చెన్నపట్టణంలో ప్రచారం చేసినా కూడా ఇక్కడ గెలిచేది తానేనని జేడీఎస్‌ అధ్యక్షుడు హెచ్‌.డి.కుమారస్వామి చేసిన సవాలుపై సిద్ధరామయ్య మాట్లాడుతూ ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా ఎవరు గెలవాలనేది ప్రజలు తీర్పు ఇస్తారని, ఓట్లను కుమారస్వామి, కాని, తాను కాని జేబుల్లో పెట్టుకోవడం లేదని అన్నారు. కుమారస్వామి గడచిన పార్లమెంటు ఎన్నికల్లో వీరప్ప మొయిలీపై  చిక్కబళ్ళాపురలో పోటీ చేసి ఓడిపోయారు, ఆయన భార్య అనిత చన్నపట్టణంలో పోటీ చేసి పరాజయం పొందారని, అప్పుడు కుమారస్వామి సవాలు ఎక్కడకు పోయిందని హేళన చేశారు. చాముండేశ్వరిలో తానే గెలుస్తానని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement