కాంగ్రెస్ను భూస్థాపితం చేయండి
కన్నడ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్న కాంగ్రెస్ను భూస్థాపితం చేయాలని కర్ణాటక ప్రజలకు ప్రధానిమోదీ పిలుపునిచ్చారు. గురువారం మోదీ యాప్ ద్వారా కన్నడ ప్రజలు, బీజేపీ అభ్యర్థులు, కార్యకర్తలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. కర్ణాటకలో అధికారం నిలుపుకునేందుకు దురుద్దేశంతో సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం ప్రజల మధ్య కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు. ఎన్నికల చివరి సమయంలో ప్రజలను ప్రలోభాలకు గురిచేసే విధంగా హామీలు గుప్పించడంలో కాంగ్రెస్ నేతలు సిద్ధహస్తులని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అబద్ధపు హామీల గురించి తెలిసే దేశంలో 22 రాష్ట్రాల ప్రజలు ఆ పార్టీకి సరైన బుద్ధి చెప్పారన్నారు. కాంగ్రెస్ను దేశం నుంచి పూర్తిగా తరిమివేసే వరకు అభివృద్ధి సాధ్యం కాదన్నారు. బెంగళూరును అభివృద్ధి చేస్తే దేశాన్ని కూడా అభివృద్ధి చేసినట్లేనన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో బెంగళూరు నగరం కనీస సౌకర్యాల కొరతను కూడా అధిగమించలేక అవస్థలు పడుతోందన్నారు. కన్నడ భాషను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానన్న ప్రధాని త్వరలోనే పూర్తిస్థాయిలో నేర్చుకుంటానన్నారు.