అందుకే కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పా: పురందేశ్వరి

Purandeswari Slams TDP Over Polavaram Project - Sakshi

సాక్షి, విజయవాడ: భారతీయ జనతా పార్టీ పోలవరం ప్రాజెక్టుకు సహకరించలేదని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. విజయవాడలో మంగళవారం మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. ‘పోలవరానికి 1935 కోట్ల పెండింగ్ బిల్లులకు సంబంధించిన నివేదిక ఇంకా కేంద్రానికి అందలేదు. పోలవరం కోసం ఏడు మండలాలను ఆంధ్రాలో కలపమని కాంగ్రెస్ పార్టీ ఆనాడు బిల్లులో పెట్టలేదు.. అందుకే నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను. పోలవరం కోసం ఏడు మండలాలను ఏపీలో కలిపింది బీజేపీనే. ప్రాజెక్టు కోసం బీజేపీ శిత్తశుద్దితో పని చేస్తోంది. కేంద్రం సిమెంట్ రోడ్లు, 24 గంటలు కరెంట్ ఇస్తే వాటిని చంద్రబాబు తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు.

కడప ఉక్కుపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై ఎన్నిసార్లు నివేదిక అడిగిన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. హోదాకు బదులు ప్యాకేజీ కావాలని చంద్రబాబే అడిగారు. జమిలీ ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన బీజేపీకి గట్టిగా ఉంది. జమిలి ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ఎన్నికల సంఘమే. వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామాలపై టీడీపీ తమపై అభాండాలు వేయడం సరికాదు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకొన్నారు. వారికి మంత్రి పదవులు ఇచ్చారు.. దానిపై ఎందుకు చంద్రబాబు మాట్లాడడం లేద’ని ప్రశ్నినించారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top