లెక్క తేలేదెప్పుడో...!

Postal Ballots Play A Key Role In Kurupam Assembly Elections2019 - Sakshi

సాక్షి, కురుపాం: పోస్టల్‌ బ్యాలెట్ల లెక్క తేలేదెప్పుడో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ నెల 22 వరకు వేసేందుకు గడువు ఉండడంతో పోస్టల్‌ బ్యాలెట్‌పైనే  వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు దృష్టి సారించారు . సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసి నెల రోజులు దాటింది. ఏప్రిల్‌ 11న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోలింగ్‌ జరిగింది. అప్పటికే ఎన్నికల అధికారులు పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను ముందుగానే సిద్ధం చేశారు. అయితే ఏప్రిల్‌ 11న ఎన్నికల విధులను నిర్వహించేందుకు వెళ్లే ప్రతీ అధికారి వివరాలు సేకరించి వారికి పోస్టల్‌ బ్యాలెట్లను అందజేశారు.  పోలింగ్‌ ముగిసి లెక్కింపు సమీపిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ అత్యంత కీలకం కానున్నాయి.

ఎన్నికల్లో ప్రతీ ఓటును ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ ఆ ఓటు దక్కాలన్న ఆలోచనలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రస్తుతం పోస్టల్‌ బ్యాలెట్‌పై దృష్టి పెట్టినట్టు చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోస్టల్‌ బ్యాలెట్లు లెక్క ఏమిటోనని తీవ్రంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని పార్టీలకు చెందిన నాయకులు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులకే ఎర చూపి ఏకంగా బేర సారాలు చేస్తున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెల 23న జరగనున్న ఎన్నికల లెక్కింపులో మొదట పోస్టల్‌ బ్యాలెట్లనే లెక్కింపుకు అవకాశం ఉండటంతో పాటు ఆ ఓట్లే తమ విజయం వైపు మలుచుకోవాలని అభ్యర్థులు దృష్టి సారించినట్టు తెలిసింది. 

1542 పోస్టల్‌ బ్యాలెట్లు
కురుపాం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన ఉద్యోగులకు 1542 పోస్టల్‌ బ్యాలెట్లు ఉన్నాయి. వీటిలో ఏప్రిల్‌ 11న కురుపాం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓటింగ్‌ ప్రక్రియలో  476 మంది ఉద్యోగులు ఎన్నికల విధులకు వెళ్లే ముందు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా మిగిలిన 1066 మందిలో 50శాతం వరకు కురుపాం తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసి పోస్టల్‌ బూత్‌లో తమ బ్యాలెట్లను వేయగా మరికొందరు తపాలా శాఖ ద్వారా పోస్టాఫీసుకు వెళ్లి అసెంబ్లీ, పార్లమెంటుకు చెందిన బ్యాలెట్లు వేశారు. ఇంకా ఈ ప్రక్రియ కొనసాగటానికి ఈ నెల 22 వరకు సమయం ఉండటంతో ఇంతలోగా పోస్టల్‌ బ్యాలెట్‌ కలిగి ఉన్న ఉద్యోగులపై వివిధ పార్టీలకు చెందిన నాయకులు దృష్టి పెట్టి పోస్టల్‌ బ్యాలెట్లను చేజిక్కించుకొనే యత్నం చేస్తున్నట్టు సమాచారం. దీంతో పోస్టల్‌ బ్యాలెట్ల లెక్క తేలకుండా పోయిందని చర్చ జరుగుతుంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top