ఇంకో 5 నెలలే.! | Political Parties Who Believe in the Election in December in Telangana | Sakshi
Sakshi News home page

ఇంకో 5 నెలలే.!

Jun 22 2018 12:45 AM | Updated on Sep 17 2018 5:36 PM

Political Parties Who Believe in the Election in December in Telangana - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్‌: జమిలి ఎన్నికల ప్రతిపాదన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ యోచన మేరకు అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరుగుతాయన్న అంచనాలు ప్రధాన రాజకీయ పక్షాలను బ్యాలెట్‌ కురుక్షేత్రంలోకి పరుగులు పెట్టిస్తున్నాయి. ఈ డిసెంబర్‌లోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయనే ఆలోచనతో అధికార టీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా వ్యూహరచనలో మునిగిపోయాయి. ఐదు నెలల తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల నగారా మోగవచ్చనే సంకేతాల నేపథ్యంలో పార్టీలన్నీ తమ తమ కోణాల్లో కసరత్తు ప్రారంభించాయి.

బంగారు తెలంగాణ కోసం
ఐదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాట పట్టించామనే ధీమాతో, మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పదునుపెట్టారు. ‘ఎన్నికలకు ఎంతో సమయం లేదు. డిసెంబర్‌లో వచ్చినా ఆశ్చర్యం లేదు’ అంటూ పార్టీ అంతర్గత చర్చల్లో టీఆర్‌ఎస్‌ నేతలను ఆయన అప్రమత్తం చేస్తూనే వస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల స్థానాల్లో ప్రస్తుత పరిస్థితులపై ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నారు. విపక్ష పార్టీల ఎమ్మెల్యేలున్న స్థానాలపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. అక్కడ పార్టీ తరఫున బరిలో దించేందుకు గట్టి అభ్యర్థులను అన్వేషిస్తున్నారు. పార్టీపరంగా, అభ్యర్థులపరంగా బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను వడపోసి వాటికి వేర్వేరు వ్యూహాలు రచిస్తున్నారు.

సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ వంటి సఫలీకృత పథకాలకు తోడు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ప్రతిష్టాత్మక రైతుబంధు వంటి పథకాలను సమర్థంగా అమలు చేసిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల మేనిఫెస్టోకు మౌలిక సదుపాయాల కల్పనే కేంద్ర బిందువుగా చేయాలని సీఎం యోచిస్తున్నారు. ఆ దిశగా పలు పథకాలకు సంబంధించి ఇప్పటికే తుది దశ చర్చలు పూర్తయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రహదారులు, స్కూళ్లు, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, దళిత, గిరిజనవాడల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు ఆలోచనలు కేసీఆర్‌ మదిలో ఉన్నాయంటున్నారు. డిసెంబర్‌లోనే ఎన్నికలు ఖాయమని తేలితే వచ్చే రెండు, మూడు నెలల్లోనే ఆయా పథకాలపై ప్రజాభిప్రాయాన్ని సేకరించాలనే కూడా ఆయన యోచిస్తున్నట్టు టీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సిటింగ్‌లందరికీ టికెట్లు ఇస్తామని బయటికి కొన్నిచోట్ల మార్పులు అనివార్యమని సీఎం భావిస్తున్నారని, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నారని సమాచారం. అవసరమైతే తాను కూడా దక్షిణ తెలంగాణ నుంచే బరిలో దిగాలనే యోచనలో ఉన్నారు.

అధికారమే లక్ష్యంగా
తెలంగాణ ఇచ్చి కూడా 2014 ఎన్నికల బరిలో బోల్తా పడ్డ కాంగ్రెస్‌ ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. డిసెంబర్‌లోనే ఎన్నికలు వస్తాయని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా ప్రకటించడం తెలిసిందే. సన్నద్ధతలో భాగంగా ఇప్పటికే బస్సుయాత్రలకు కాంగ్రెస్‌ తెర తీసింది. రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్‌లతో పాటు ఉత్తర తెలంగాణను దాదాపుగా చుట్టేసింది. ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టడంతో పాటు అధికారంలోకి వస్తే తామేం చేస్తామో ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా రూ.2 లక్షల వరకు రైతులకు ఏకకాల రుణమాఫీ, నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి, మహిళా సంఘాలకు రుణాలు, పంటల గిట్టుబాటు ధరల కోసం మార్కెట్‌ స్థిరీకరణ నిధి వంటి ప్రజాకర్షక పథకాలను ప్రజల ముందు పెట్టింది. మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో పడింది.

పార్టీపరంగా పలు కమిటీలు వేసుకుని పని విభజన చేసుకునే కసరత్తును ఇప్పటికే పూర్తి చేసింది. వీటిని రెండు మూడు రోజుల్లోనే ప్రకటిస్తారని తెలుస్తోంది. పీసీసీ మాజీ అధ్యక్షులు, సీనియర్‌ నేతలకు ఈ కమిటీల్లో స్థానం కల్పించడం ద్వారా ప్రజాక్షేత్రంలోకి పటిష్ట వ్యూహంతో వెళ్లేలా కాంగ్రెస్‌ అధిష్టానం కూడా దృష్టి సారించింది. రాష్ట్రంలోని 31 రిజర్వుడు అసెంబ్లీ స్థానాల్లో ఎల్‌ఆర్‌ఎండీసీ (లీడర్‌షిప్‌ మిషన్‌ ఇన్‌ రిజర్వ్‌డ్‌ కాన్సిస్ట్యుయెన్సీస్‌) కార్యక్రమం ద్వారా పోలింగ్‌ బూత్‌స్థాయిలో క్యాడర్‌ను సమాయత్తం చేస్తోంది. ప్రతి కార్యకర్తనూ ఎన్నికల పోరులో ఉపయోగించుకునేలా ‘శక్తి యాప్‌’ పేరుతో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కూ తెర తీసింది. కానీ నేతల్లో అనైక్యత ఎన్నికల వేళ నష్టం కలిగించవచ్చనే ఆందోళన కూడా అధిష్టానంలో ఉంది. అందుకే నేతల మధ్య ఐక్యత కోసం ఢిల్లీ పెద్దలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే టీ కాంగ్రెస్‌ నేతలతో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ భేటీ అవుతారని తెలుస్తోంది. దీనికి తోడు నేతలంతా మూకుమ్మడి పాదయాత్రలకు శ్రీకారం చుట్టే అవకాశాలూ కన్పిస్తున్నాయి.

‘మోడీ–షా’ చరిష్మాపైనే భారం
బీజేపీ పెద్దలు కూడా తెలంగాణపై దృష్టి సారించారు. ఏకకాల ఎన్నికలు నిర్వహించే యోచనతో కదులుతున్న బీజేపీ, రాష్ట్రంలో నాలుగైదు లోక్‌సభ స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీపరంగా బలంగా ఉండే హైదరాబాద్, సికింద్రాబాద్‌ స్థానాలకు తోడు వరంగల్, భువనగిరి, నిజామాబాద్‌ నియోజకవర్గాల్లో గెలుపే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తోంది. మోదీ చరిష్మా, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా మ్యాజిక్‌ను నమ్ముకుని ఎన్నికల బరిలో దిగుతున్నారు కమలనాథులు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో యాత్రలు కూడా ప్రారంభించారు.

ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, నల్లగొండ, వరంగల్‌ జిల్లాల్లో అసెంబ్లీకి బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని పార్టీ యోచిస్తోంది. యువకులు, విద్యావంతులను రంగంలోకి దించే దిశగా పావులు కదుపుతోంది. అమిత్‌ షా ఇప్పటికే తెలంగాణపై దృష్టి సారించారని, ఆయన చేయాల్సిన కార్యక్రమాలు చాపకింద నీరులా జరిగిపోతున్నాయని, దక్షిణాదిన తెలంగాణ కూడా బీజేపీ టార్గెట్‌ రాష్ట్రాల జాబితాలో చేరిందనే రాజకీయ వర్గాలంటున్నాయి. ప్రధాన పార్టీలతో పాటు, రాష్ట్రంలో ఎంతో కొంత ప్రభావం చూపే వామపక్షాలు, కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి, హైదరాబాద్‌లో గణనీయ స్థానాలు గెలుచుకునే సత్తా ఉన్న మజ్లిస్‌ కూడా ఎన్నికల వ్యూహాలను పదును పెడుతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement