‘ఆరు రోగాలతో ఆ పార్టీ కుదేలు’

Pm Narendra Modi Says Congress Is Affected With Six Diseases - Sakshi

సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్‌ పార్టీని ఆరు రోగాలు పట్టిపీడిస్తున్నాయని, ఆ పార్టీ ఎక్కడికి వెళ్లినా ఈ రోగాలు వదలడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కాంగ్రెస్‌ కల్చర్‌, మతతత్వం, కులతత్వం, నేరాలు, అవినీతి, కాంట్రాక్టర్‌ వ్యవస్థ అనే ఆరు రుగ్మతలు ఆ పార్టీని వెంటాడుతున్నాయని ఆరోపించారు. ప్రధాని మోదీ బుధవారం కోలార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్‌ పార్టీలో అపార అనుభవం ఉన్న నేతలను పక్కనపెట్టి తాను ప్రధాని పదవిని చేపట్టేందుకు సిద్ధమని నిన్న కర్ణాటకలో ఓ నేత చెప్పారని, తానే ప్రధానిని ఓ వ్యక్తి ప్రకటించడమంటే ఇంతకు మించి అహంకారం మరొకటి ఉంటుందా అని రాహుల్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీకి చీకటి ఒప్పందాలు చేసుకోవడంపైనే ఆసక్తి ఉంటుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎంపీ, కర్ణాటక మాజీ సీఎం వీరప్ప మొయిలీనే ఈ విషయం వెల్లడించారని చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్లు అమ్ముకుని నిధుల సమస్య తీర్చుకుందని పీడబ్ల్యూడీ మంత్రి ఈ డీల్‌ను చక్కబెట్టారని ఆరోపించారు. మోదీని తప్పించేందుకు భారీ సమావేశాలు జరుపుతున్నారని, రాహుల్‌ తాను ప్రధాని పగ్గాలు చేపడతానని ప్రకటించడంపై ఈ బడా నేతలు ఎలా స్పందిస్తారో చూడాలని ప్రధాని వ్యాఖ్యానించారు. కాగా మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా, మే 15న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top