రాజ్యాధికారం చిన్న కులాలకే దక్కాలి: గద్దర్
గజ్వేల్ రూరల్: రాష్ట్ర ప్రజలు ప్యూడలిజం వద్దంటున్నారని ప్రజా గాయకుడు గద్దర్ పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బెజుగామ గ్రామంలో ఆయన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ‘నాయకులు అభివృద్ధి పేరున వస్తున్నారు.. రోడ్లు మాత్రమే విశాలమయ్యాయి.. రోడ్ల పక్కన ఉండే భూములకు ధరలు పెరిగాయే తప్ప సాగుచేసిన పంటలకు ధర పెరగలేదు’అని అన్నారు. విద్యార్థుల త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణలో వారికి ఉద్యోగాలు లేవన్నారు.
అంబేడ్కర్ కోరుకున్నట్లు చిన్న రాష్ట్రాలలో చిన్న కులాలకు అధికారం రావాలని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రకటించిన 105 సీట్లలో 11 వెలమలకు ఇస్తే.. 52 శాతమున్న బీసీలకు 20 సీట్లు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. ఈ సందర్భంగా పాటలు పాడుతూ ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, జైభీమ్, అంబేడ్కర్ యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.