‘ఎవరూ చంపలేదు.. వాళ్లే చనిపోయారు’

No one killed Sohrabuddin, Just died: Rahul Gandhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పదమూడేళ్లనాటి సొహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసు నిందితులందరూ నిర్దోషులేనని స్పెషల్‌ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించడంపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యంగ్యంగా స్పందించారు. సొహ్రాబుద్దీన్, అతడి ఎన్‌కౌంటర్‌ కేసుతో సంబంధమున్న వారిని ఎవరూ చంపలేదని వారే చనిపోయారని ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. ‘ఎవరూ చంపబడలేదు. హరేన్‌ పాండ్యా, తులసీరామ్‌ ప్రజాపతి, జస్టిస్‌ లోయా, ప్రకాశ్‌ తొంబ్రే, శ్రీకాంత్‌ ఖండాల్కర్‌, కౌసర్‌ బీ, సోహ్రాబుద్దీన్‌ షేక్‌.. వారికి వారే చనిపోయార’ని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. (నిందితులంతా నిర్దోషులే)

సొహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో 21మంది పోలీసు అధికారులు సహా మొత్తం 22 మందీ నిర్దోషులేనని ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో మొత్తం 210 మంది సాక్షులను విచారించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను 2010లో అరెస్ట్‌ చేశారు. 2014 డిసెంబర్‌లో ఈ కేసు నుంచి ఆయన బయటపడ్డారు. ఈ కేసును విచారించిన సీబీఐ కోర్టు జడ్జి బీహెచ్‌ లోయా మూడేళ్ల క్రితం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం పలు అనుమానాలకు తావిచ్చింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top