‘చివరి అంచుల్లో నక్సలిజం’ | Rajnath Singh on Naxalism Present Situation In India | Sakshi
Sakshi News home page

నక్సలిజం చివరి దశలో ఉంది - రాజ్‌నాథ్‌ సింగ్‌

Mar 24 2018 6:44 PM | Updated on Sep 27 2018 2:34 PM

Rajnath Singh on Naxalism Present Situation In India - Sakshi

గుర్‌గావ్‌ : దేశంలో నక్సజలిం చివరి అంచుల్లో ఉందని, భద్రతా దళాలు నక్సలిజాన్ని ఎదుర్కోవడంలో విజయవంతం అయ్యాయని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. హరియాణాలోని గుర్‌గావ్‌లో శనివారం సీఆర్‌పీఎఫ్‌ దళాల 79వ రైసింగ్‌ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుక్మా ఎన్‌కౌంటర్‌లో మరణించిన జవాన్లకు నివాళులర్పించిన అనంతరం రాజ్‌నాథ్‌ ప్రసంగించారు. 

‘నక్సలిజాన్ని ఎదుర్కొవడం పెద్ద సవాల్‌. కానీ, సీఆర్‌పీఎఫ్‌ సహా భద్రతాదళాలు దానిని కట్టడి చేయటంలో కృషి చేస్తున్నాయి. భద్రతా దళాలను నేరుగా ఎదుర్కొనే శక్తిలేక మావోయిస్టులు పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారు. దీనివల్ల భద్రతా సిబ్బంది మరణాల రేటు తీవ్రంగా పెరిగింది. అందుకే నక్సల్‌ వ్యతిరేక చర్యలను పోత్సహిస్తున్నాం. నిర్ణయాత్మక చర్యలతో వారి చేష్టలను తిప్పికొడుతున్నాం’ అని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. 

వాళ్లే నష్టపోతున్నారు...
‘మావోయిస్టుల చర్యల వల్ల సామాన్య ప్రజానీకం కూడా ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకం. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. వారి చర్యల వల్ల వారే నష్టపోతున్నారు’ అని రాజ్‌నాథ్‌ తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి వ్యతిరేకంగా మావోయిస్టులు పని చేస్తున్నారని, చివరకు రోడ్లు వేస్తున్న సిబ్బందిని కూడా హతమారుస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. నిజానికి రైసింగ్‌ డే మార్చి 19నే కాగా, రాజ్‌నాథ్‌ బిజీ షెడ్యూల్‌ మూలంగా ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement