ప్రధాని పర్యటన అబద్ధాలమయం
మోదీపై విరుచుకుపడ్డ రాహుల్
వయనాడ్ (కేరళ): గత లోక్సభ ఎన్నికల ప్రచారం సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలన్నీ అబద్ధాలు, విద్వేషం, విషపూరిత వ్యాఖ్యలతో నిండిపోయాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ ప్రజలను విడగొట్టాలనే ఉద్దేశంతో మోదీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. తమ పార్టీ మాత్రం ప్రేమ, నిజం, ఆప్యాయత వైపు నిలిచిందని పేర్కొన్నారు. వయనాడ్ లోక్సభ స్థానానికి ఎంపీగా తనను గెలిపినందుకు గానూ అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ రాహుల్ కేరళలో పర్యటిస్తున్నారు.
దీనిలో భాగంగా శనివారం కల్పెట్టా, కంబలకాడు, పనమారమ్ ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. అనంతరం పలు రోడ్షోలలో పాల్గొన్నారు. ‘మోదీ దగ్గర డబ్బు, మీడియా, ధనికులైన స్నేహితులు ఉండవచ్చు. కానీ దేశంలో బీజేపీ సృష్టించిన విద్వేషం, అసహనంపై కాంగ్రెస్ ఎప్పటికీ పోరాడుతూనే ఉంటుంది. ప్రేమ, ఆపాయ్యతతో వాటిని అధిగమిస్తుంది’అని రాహుల్ అన్నారు. వయనాడ్లో ఎన్నో సమస్యలు ఉన్నాయని.. అందరం కలిసికట్టుగా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. రాహుల్ రోడ్షోలకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది.