LIVE Updates: Attack on YS Jagan, How it Happened | వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం: లైవ్‌ అప్‌డేట్స్‌ - Sakshi
Sakshi News home page

Published Thu, Oct 25 2018 2:07 PM

Murder Attempt on YS Jagan, Live Updates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రజల సంక్షేమం కోసం నిరంతరం తపిస్తూ.. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ జనం గుండె చప్పుడు తెలుసుకుంటున్న జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరగడం తీవ్ర సంచలనం రేపింది. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి ఓ దుండగుడు వైఎస్‌ జగన్‌పై కోళ్ల పందేలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. అత్యంత భద్రత ఉండే ఎయిర్‌పోర్ట్‌లో సాక్షాత్తూ రాష్ట్ర ప్రతిపక్ష నేతపై ఇలా హత్యాయత్నం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్‌ ఇవి..

వైఎస్‌ జగన్‌కు కేసీఆర్‌ పరామర్శ
దాడికి గురైన వైఎస్‌ జగన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫోన్‌లో పరామర్శించారు. దాడి, చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జైపాల్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కూడా వైఎస్‌ జగన్‌ను పరామర్శించారు.

హెల్త్‌ బులెటిన్‌ విడుదల
వైఎస్‌ జగన్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్‌ బులెటిన్‌లో సిటీ న్యూరో వైద్యులు తెలిపారు. కత్తి బలంగా ఆయన శరీంలోకి దిగిందని, తొమ్మిది కుట్లు వేశామని వెల్లడించారు. బయాప్సిని పరీక్షలకు పంపించినట్టు చెప్పారు.

ప్రజల దీవెనలతోనే...
ఆంధ్రప్రదేశ్‌ ప్రజల దీవెనలు, వేంకటేశ్వర స్వామి ఆశీ​ర్వాదంతో వైఎస్ జగన్‌కు ప్రాణాపాయం తప్పిందని  విజయసాయిరెడ్డి అన్నారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం వెనుక కచ్చితంగా కుట్ర ఉందని, దీని వెనుక ఎవరున్నారో ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. వైఎస్ జగన్‌కు సెక్యురిటీ పెంచాలని పదేపదే చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు.

ఆస్పత్రికి చేరుకున్న వైఎస్‌ విజయమ్మ
వైఎస్‌ జగన్‌ తల్లి వైఎస్‌ విజయమ్మ, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి హైదరాబాద్‌ సిటీ న్యూరో ఆస్పత్రికి చేరుకున్నారు. తన కుమారుడిపై హత్యాయత్నం జరగడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విజయమ్మ.

జానారెడ్డి పరామర్శ
హైదరాబాద్‌ సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్‌ జగన్‌ను తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కె. జానారెడ్డి పరామర్శించారు. జగన్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైఎస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ఎవరూ ఆందోళన చెందవద్దు
తనపై జరిగిన దాడి పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని వైఎస్‌ జగన్‌ ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. భగవంతుడి దయ, కోట్లాది మంది ప్రజల, ఆశీస్సులే తనను రక్షించాయని ఆయన పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం తాను చేసే పోరాటాలను ఇటువంటి పిరికిపంద చర్యలు ఆపలేవని ట్వీట్‌ చేశారు.

సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స
హైదరాబాద్‌ సిటీ న్యూరో ఆస్పత్రిలో వైఎస్‌ జగన్‌కు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. భుజానికి కుట్లు వేయాల్సివుంటుదని వైద్యులు తెలిపారు. గాయమైన ప్రదేశం నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. కత్తికి విషం పూసారా, లేదా అన్నది పరీక్షల తర్వాతే తెలుస్తుందన్నారు. మరోవైపు వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి ఆస్పత్రికి చేరుకున్నారు.

ఖండించిన నాయకులు
వైఎస్‌ జగన్‌పై దాడి జరగడాన్ని పలు పార్టీల నాయకులు ఖండించారు. ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ దాడిని గర్హించారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరగడాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత కూడా ఖండించారు. వైఎస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

  • శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్‌ జగన్‌.. పెద్ద ఎత్తున చేరుకున్న తెలంగాణ వైఎస్సార్సీపీ శ్రేణులు.. తమ అధినేతపై హత్యాయత్నం నేపథ్యంలో ఎయిర్‌పోర్టు వద్ద పార్టీ శ్రేణుల ఆందోళన

సురేశ్‌ ప్రభు దిగ్భ్రాంతి...

  • ఢిల్లీ: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడి పట్ల పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది పిరికిపంద చర్య అని ఆయన అభివర్ణించారు. సీఐఎస్ఎఫ్ సహా అన్ని సంస్థలను ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు ట్విట్టర్‌లో ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ మొదలుపెట్టామని, దీనికి బాధ్యులెవరో గుర్తించాలని పౌర విమానయాన శాఖ కార్యదర్శిని ఆదేశించామని తెలిపారు.

ఏపీ డీజీపీకి గవర్నర్‌ నరసింహన్‌ ఫోన్‌

  •  వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో ఏపీ డీజీపీకి గవర్నర్‌ నరసింహన్‌ ఫోన్‌ చేశారు. హత్యాయత్నంపై వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఘటనపై తక్షణమే నివేదిక ఇవ్వాలని డీజీపీని గవర్నర్‌ ఆదేశించారు. ఈ క్రమంలో ఏపీ డీజీపీ ఆఫీస్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు బయల్దేరి వెళ్లారు.


    జగన్‌పై హత్యాయత్నాన్ని ఖండించిన బీజేపీ
  • ఇటువంటి దాడులు దారుణం. ఇలాంటివాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. కోళ్ల పందాలకు వాడే కత్తి పదును తీవ్రంగా ఉంటుంది. కుట్రపూరితంగా జరిగిందేమోనని అనుమానం కలుగుతోంది:  సోము వీర్రాజు

    జగన్‌పై హత్యాయత్నాన్ని ఖండించిన జీవీఎల్‌
  • సురక్షితంగా భావించే ఎయిర్‌పోర్ట్‌లో ఇటువంటి దాడులు జరగడం దారుణమని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు డిమాండ్‌ చేశారు.


వైఎస్సార్సీపీ శ్రేణుల దిగ్భ్రాంతి

  • తమ అభిమాన వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరగడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని విశాఖ ఎయిర్‌పోర్ట్‌ ముందు వైఎస్సార్‌సీపీ శ్రేణులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎయిర్‌పోర్ట్‌లోకి కత్తి ఎలా వెళ్లిందని, తనిఖీ చేయకుండా ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది దుండగుడిని ఎలా లోపలికి పంపించారని వారు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన దుండగుడు అక్కడి రెస్టారెంట్‌లో పనిచేస్తుండగా.. ఆ రెస్టారెంట్‌ యజమాని హర్షవర్దన్‌ అని, అతను గతంలో గాజువాక నుంచి టీడీపీ టికెట్‌ కోసం ప్రయత్నించారని తెలుస్తోంది.

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం

  • వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌పై విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. ప్రజాసంకల్పయాత్ర పూర్తిచేసుకుని హైదరాబాద్‌కు చేరుకునేందుకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లో ఆయన ఎదురుచూస్తుండగా దాడి జరిగింది. అక్కడి రెస్టారెంట్‌లో పనిచేసే వెయిటర్‌ శ్రీనివాస్‌ సెల్ఫీ నెపంతో వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చి.. కత్తితో మెడపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. వైఎస్‌ జగన్‌ తప్పించుకోవడంతో ఆయన భుజానికి తీవ్రగాయమైంది. కోడిపందేలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడని, ఉద్దేశపూర్వకంగానే ఈ హత్యాయత్నం జరిగినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.

Advertisement
Advertisement