దిగ్విజయ్‌, శివకుమార్‌ అరెస్ట్! | Sakshi
Sakshi News home page

అమృతహల్లి పోలీస్‌ స్టేషన్‌లో దిగ్విజయ్‌ సింగ్‌

Published Wed, Mar 18 2020 9:20 AM

MP Politics At Bengalore Hotel Digvijaya Singh In Preventive Custody - Sakshi

బెంగళూరు : మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో తక్షణమే విశ్వాస పరీక్ష జరపాలన్న విషయంపై వైఖరి తెలపాలని సుప్రీంకోర్టు కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఇరకాటంలో పడింది. మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతుగా బెంగళూరులో మకాం వేసిన 21మంది రెబల్‌ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రమాడ హోటల్‌లో తలదాచుకున్న రెబల్‌ ఎమ్మెల్యేలను కలిసేందుకు బుధవారం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ బెంగళూరు వెళ్లారు. కర్ణాటక కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడు శివ కుమార్‌ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వారు హోటల్‌ దగ్గరకు వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. లోపలికి వెళ్లటానికి వీళ్లేదంటూ బయటే ఆపేశారు. దీంతో ఆగ్రహించిన దిగ్విజయ్‌ హోటల్‌ బయట ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్‌, శివకుమార్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారితో పాటు మరికొంతమంది కాంగ్రెస్‌ నేతలను అమృతహల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ( రిసార్టు రాజకీయాలకు కేరాఫ్‌ కర్ణాటక )

అంతకు క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నేను మధ్యప్రదేశ్‌ రాజ్యసభ కాంగ్రెస్‌ అభ్యర్థిని.  ఈనెల 26న ఎన్నికలు జరగనున్నాయి. మా ఎమ్మెల్యేలను ఇక్కడ దాచేశారు. వాళ్లు నాతో మాట్లాడాలనుకుంటున్నారు. వారి ఫోన్లను లాక్కున్నారు. పోలీసులు కూడా నన్ను వారితో మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారు. వాళ్లు వెనక్కు తిరిగి వస్తారని అనుకున్నాం. కానీ, వాళ్లను వెనక్కు రానీయటంలేదు. వారి కుటుంబసభ్యుల దగ్గరినుంచి సందేశాలు వస్తున్నాయి. నేను ఐదుగురు రెబల్‌ ఎమ్మెల్యేలతో​ మాట్లాడాను. వారిని నిర్భందంలో ఉంచారని చెప్పారు. సెల్‌ఫోన్లు దొంగలించారట! ప్రతి రూము దగ్గర పోలీసు బందోబస్తు ఉంది. ప్రతి నిమిషం వారి వెన్నంటే ఉంటున్నార’’ని చెప్పారు. (  బలపరీక్షపై వైఖరేంటి? )

Advertisement
Advertisement