
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైన మాదిగలను సీఎం కేసీఆర్ అణచివేస్తున్నారని టీడీపీ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను మోత్కుపల్లి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి మంగళవారం ప్రత్యేక ములాఖత్లో పరామర్శించారు.
జైలు బయట మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ 59 కులాల మేలు కోసం ఎస్సీ వర్గీకరణ ఉద్యమం చేస్తున్న మంద కృష్ణను సీఎం కేసీఆర్ కుట్రపూరితంగా జైల్లో పెట్టారన్నారు. కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు.