టీఆర్‌ఎస్‌లో రెబెల్స్‌కు చెక్‌ | ktr meets to trs rebels | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో రెబెల్స్‌కు చెక్‌

Nov 22 2018 4:52 AM | Updated on Nov 22 2018 4:52 AM

ktr meets to trs rebels - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెబెల్స్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి దృష్టిపెట్టింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో తిరుగుబాటుదారులను బుజ్జగించేందుకు మంత్రి కేటీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీ ఓట్లు చీలిపోకుండా రెబెల్స్‌ అందరితో చర్చలు జరుపుతున్నారు. కొంతకాలంగా పార్టీ గ్రేటర్‌ బాధ్యతలను కేటీఆర్‌ పర్యవేక్షిస్తున్నారు. గురువారం (22వ తేదీ) నుంచి గ్రేటర్‌లో కేటీఆర్‌ రోడ్‌షోలు సైతం చేపట్టనున్నారు. అలాగే నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో మంత్రి స్వయంగా చొరవ తీసుకుని రెబెల్స్‌తో మాట్లాడుతున్నారు. భవిష్యత్‌లో అందరికీ అవకాశాలు వస్తాయని హామీ ఇస్తున్నారు. దీంతో వెనక్కుతగ్గిన పలువురు అసమ్మతులు ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మిగతా వారు కూడా నేటి సాయంత్రానికి తప్పుకోనున్నట్లు సమాచారం.  

పోటీ నుంచి తప్పుకున్న రెబెల్స్‌..
మహేశ్వరంలో తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన కొత్త మనోహర్‌రెడ్డి బుధవారం కేటీఆర్‌తో సమావేశమయ్యారు. కేటీఆర్‌తో చర్చల అనంతరం పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పి వెళ్లారు. అదే విధంగా శేరిలింగంపల్లిలో శంకర్‌గౌడ్, కంటోన్మెంట్‌లో నగేశ్, ఖైరతాబాద్‌లో మన్నె గోవర్ధన్, రాజేంద్రనగర్‌లో తోకల శ్రీనివాసరెడ్డి, మరో అభ్యర్థితో కేటీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. పోటీ నుంచి తప్పుకుంటే భవిష్యత్‌లో మంచి అవకాశాలుంటాయని, రాబోయేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని వారిలో భరోసా నింపుతున్నారు. దీంతో రెబెల్స్‌ సమస్య దాదాపుగా కొలిక్కి వచ్చిందని సమాచారం. దీంతో గ్రేటర్‌లో జరగనున్న కేటీఆర్‌ రోడ్‌షోలకు నాయకులంతా హాజరుకానున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement