
కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా ఆమోదం పొందింది.
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా ఆమోదం పొందింది. రాజగోపాల్ రెడ్డి సోమవారం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారని తెలంగాణ ప్రభుత్వం గెజిట్ ద్వారా వెల్లడించింది. ఆయన రాజీనామాతో నల్లగొండ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ పదవి ఖాళీ అయినట్టు అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జోడు పదవుల నేపథ్యంలో రాజగోపాల్ ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు.
డిసెంబర్ 7న జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లా మునుగోడు నుంచి ప్రజాకూటమి తరపున కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిపై 22,525 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్రంలో ప్రజాకూటమి చిత్తుగా ఓడగా ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. కాగా ఈ ఎన్నికల్లో నల్లగొండ నుంచి అయిదో విజయం కోసం పోటీపడిన రాజగోపాల్ సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమిని మూటగట్టుకున్నారు.