రైతు సంక్షేమానికే తొలి ప్రాధాన్యత: మోదీ
బెంగళూరు: కర్ణాటకలోని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వం రైతు సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించిందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. పంటల బీమా పథకాన్ని అమలు చేయలేకపోయిందని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతు సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు.
ఈ నెల 12న రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ కిసాన్ మోర్చా కార్యకర్తలతో బుధవారం ప్రధాని ‘నరేంద్రమోదీ యాప్’ ద్వారా ముఖాముఖి నిర్వహించారు. ‘విత్తనాల కొనుగోలు నుంచి విక్రయం దాకా (బీజ్ సే బజార్ తక్) రైతుకు సాయపడటమే ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప రైతు నేత. ఆయన అపార అనుభవం, అంకితభావం కేంద్రం విధానాలకు తోడై రాష్ట్రంలో వ్యవసాయరంగానికి కొత్త ప్రేరణ ఇచ్చినట్లవుతుంది. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చి యువత కూడా సాగును వృత్తిగా స్వీకరించేలా చేస్తాం’ అని అన్నారు.