హరియాణాలో పైలట్‌ బృందం.. కపిల్‌ సిబాల్‌ స్పందన

Kapil Sibal Questions Sachin Pilot What About Ghar Wapsi - Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌ రాజకీయాలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కపిల్‌ సిబాల్‌ ఏదో ఒక వ్యాఖ్య చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన మరోసారి తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ని ఎద్దేవా చేస్తూ ఓ ట్వీట్‌ చేశారు. బీజేపీలో చేరబోవడం లేదంటూ పైలట్‌ చేసిన ప్రకటనపై కపిల్‌ సిబాల్‌ స్పందిస్తూ.. ‘ప్రత్యర్థులు నా ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి (పైలట్‌ బీజేపీలో చేరతారంటూ) ప్రచారం చేస్తున్నారు అన్నావ్‌.. బీజేపీలో చేరడం లేదు అన్నావ్‌ కానీ హరియాణా మనేసర్‌లోని ఓ హోటల్‌లో శాసనసభ్యులతో కలిసి సెలవులు ఎంజాయ్‌ చేస్తున్నట్లున్నావ్‌.. అది కూడా బీజేపీ కనుసన్నల్లో.. మరి సొంత గూటికి తిరిగి వచ్చే ఆలోచన ఉందా లేదా’‌ అంటూ కపిల్‌ సిబాల్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. (‘అందంగా ఉంటే సరిపోదు’)

పైలట్‌, అతని అనుచరులు హరియాణాలోని మనేసర్‌లో ఓ హోటల్‌లో బస చేస్తున్నారనే వార్తలు వచ్చిన తర్వాత కపిల్‌ సిబాల్‌ ఈ ట్వీట్‌ చేశారు. హరియాణాలో బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. పైలట్‌ తన అనుచరులతో హరియాణాలో మకాం పెట్టడంతో.. బీజేపీ అండతోనే సచిన్‌.. పార్టీకి  ఎదురు తిరిగాడని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు. బీజేపీ తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తుందని అశోక్‌ గహ్లోత్‌ పేర్కొన్న తర్వాత రాష్ట్రంలో ఈ సంక్షోభం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గహ్లోత్‌ ప్రభుత్వం పైలట్‌తో సహా మరికొందరికి నోటీసులు జారీ చేసింది. అయితే పైలట్‌ శిబిరం ఈ నోటీసులను జోక్‌గా వర్ణించింది. ఆ తర్వాత పైలట్‌ తన అనుచరులతో రాజస్తాన్‌ నుంచి వెళ్లిపోయి.. గహ్లోత్‌ ప్రభుత్వం మైనార్టీలో ఉందని పేర్కొన్నాడు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top