ధాన్యం విక్రయించాక ధరలు పెంచుతారా! | Sakshi
Sakshi News home page

ధాన్యం విక్రయించాక ధరలు పెంచుతారా!

Published Fri, Mar 30 2018 12:05 PM

Kakani Goverdan Reddy Visit Buy grain Centres - Sakshi

మనుబోలు: ధాన్యం విక్రయించిన తర్వాత ధరలు పెంచితే రైతులకు ఒరిగేదేంటని వైఎస్సార్‌ సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించి రైతులు, సిబ్బందితో మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల కష్టాలు వింటుంటే ఈ ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి వారిని ఇబ్బందులపాలు చేయడానికి మనసెలా వస్తుందో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వం క్వింటాకు రూ.210 పెంచామని చెప్పడం రైతులను భ్రమపెట్టడమేనన్నారు. సోమిరెడ్డి మిల్లర్ల నుంచి ముడుపులు తీసుకుని వారితో కుమ్మక్కయ్యాడని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామన్నారు. అధికారులే దగ్గరుండి కేజీ తరగు తీసుకుంటున్నారని అన్నదాతలు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. మనుబోలులో 8 వేల పుట్ల ధాన్యం పండిస్తే కొనుగోలు కేంద్రం ద్వారా 180 పుట్లు తీసుకున్నామని అధికారులే చెబుతుండటం సిగ్గుచేటన్నారు.

రైతు బాంధవుడా?
 రైతులను బాధించే సోమిరెడ్డి రైతు బాంధవుడెలా అవుతాడని కాకాణి ప్రశ్నించారు. ఎకరాకు 4.50 పుట్లు పండించారని మంత్రే చెబుతుంటే 4 పుట్లకు మించి తీసుకోమని అధికారులు అంటున్నారని మిగిలిన అర పుట్టి ధాన్యాన్ని ఏం చేయాలి?, సోమిరెడ్డికి మామూలు ఇవ్వాలా అని ప్రశ్నించారు. మూడువారాల నుంచి తాము చెబుతుంటే ఇప్పుడు మిల్లర్లపై దాడులు చేస్తున్నామంటూ ఆర్భాటపు ప్రకనలు చేస్తున్నారని మండిపడ్డారు. సోమిరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే గొట్లపాలెం లింక్‌ కెనాల్‌ను ఏడాదిలో పూర్తిచేసి ఓట్లు అడగాలన్నారు. లేకుంటే తాము అధికారంలోకి వచ్చాక ఏడాదిలో దాన్ని పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట వైఎస్సార్‌ సీపీ నాయకులు రావుల అంకయ్యగౌడ్, బొమ్మిరెడ్డి వెంకురెడ్డి, మన్నెమాల సుధీర్‌రెడ్డి, గుమ్మడి వెంకటసుబ్బయ్య, చెందులూరు శ్రీనివాసులు, చేవూరు ఓసూరయ్య, మారంరెడ్డి ప్రదీప్‌ రెడ్డి, మోటుపల్లి వెంకటేశ్వర్లు, ఆవుల తులసీరాం, ఆవుల వెంకటరమణయ్య, నారపరెడ్డి కిరణ్‌రెడ్డి, కుడమల వెంకరమణయ్య గౌడ్, దాసరి భాస్కర్‌ గౌడ్, దాసరి మహేంద్రవర్మ, నర్రా వెంకయ్య, సురేందర్‌ రెడ్డి, విష్ణు తదితరులున్నారు.

Advertisement
Advertisement