
ప్రభుత్వం ఎవరి పెన్షన్లు తీసివేయలేదని తెలిపారు. పింఛన్ల వెరిఫికేషన్ మాత్రమే జరుగుతుందని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు.
సాక్షి, విజయవాడ: ‘పేమెంట్ బ్యాచ్’ అంతా టీడీపీలో ఉంటే.. పింఛన్ లబ్ధిదారులు మొత్తం తమవైపు ఉన్నారని వైఎస్సార్సీపీ నేత, తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్ అన్నారు. పేద ప్రజల గడప వద్దకే సంక్షేమ ఫలాలు అందేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన అందిస్తున్నారని ఆయన తెలిపారు. టీడీపీ చేసే అసత్య ప్రచారాలను ఖండిస్తూ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పింఛన్ లబ్ధిదారులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ చుట్టుగుంట సెంటర్ నుంచి విశాలాంధ్ర రోడ్డు వరకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలతో సాగింది. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎవరి పెన్షన్లు తీసివేయలేదని తెలిపారు. పింఛన్ల వెరిఫికేషన్ మాత్రమే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ అబద్ధపు ప్రచారాలు నమ్మవద్దని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు, రేషన్ కార్డులు వస్తాయని దేవినేని అవినాష్ పేర్కొన్నారు.
పేద ప్రజల ప్రభుత్వమే.. సీఎం జగన్ ప్రభుత్వమని ఆయన గుర్తుచేశారు. రాష్టానికి మరో 30 ఏళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కొనసాగుతారని అన్నారు. సిగ్గుమాలిన పార్టీ టీడీపీ అని ఆయన దుయ్యబట్టారు. టీడీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ప్రజల సంక్షేమానికి చేసిందేమి లేదన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో లబ్ధిదారుల అందరికీ పెన్షన్లు వస్తాయని ఆయన తెలిపారు. ప్రతిపక్ష నేతలు.. సీఎం జగన్ ప్రజల ఉసురు పోసుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు. అర్హులు అందరికి పెంన్షన్ ఇంటివద్దకే వాలంటీర్ ద్వారా ఇచ్చినందుకా అని దేవినేని ప్రశ్నించారు. టీడీపీ నేతలు రేషన్ కార్డులు తీసేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. వారిని ప్రజలు నమ్మవద్దని దేవినేని అవినాష్ తెలిపారు.