కాంగ్రెస్‌ అభ్యర్థుల ఖరారులో మరో అంకం  | Congress Screening Committee And Telangana Election Committee Meeting | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా వడపోత!

Oct 11 2018 1:29 AM | Updated on Mar 18 2019 7:55 PM

Congress Screening Committee And Telangana Election Committee Meeting - Sakshi

కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సభ్యులతో మాట్లాడుతున్న కుంతియా. చిత్రంలో స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్, సభ్యులు 

సాక్షి, హైదరాబాద్‌: ‘‘మీకు టికెట్‌ ఎందుకివ్వాలి? ఇస్తే ఎలా గెలుస్తారు? అందుకు మీ దగ్గరున్న వ్యూహాలేంటి? అసలు మీ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లున్నాయో కచ్చితంగా చెప్పండి’’–ఇవీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తున్న కాంగ్రెస్‌ నేతలను ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీ అడిగిన ప్రశ్నలు. వీటితోపాటు ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశంపైనా ఆరా తీసినట్టు తెలిసింది. అభ్యర్థులను పకడ్బందీగా వడపోసిన తర్వాతే జాబితా తయారుచేసే దిశగా స్క్రీనింగ్‌ కమిటీ తన పని ప్రారంభించినట్టు తెలుస్తోంది.

పారదర్శకంగానే అభ్యర్థుల ఎంపిక... 
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ ఏర్పాటు చేసిన స్క్రీనింగ్‌ కమిటీ నాలుగు రోజుల రాష్ట్ర పర్యటన కోసం బుధవారం ఉదయం హైదరాబాద్‌ వచ్చింది. కమిటీ చైర్మన్‌ భక్తచరణ్‌దాస్, సభ్యులు శర్మిష్ట ముఖర్జీ, జ్యోతిర్మణిలు గోల్కొండ రిసార్ట్స్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఉదయం 11:30 గంటల నుం చి సాయంత్రం 7 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. టికెట్ల ఖరారులో సభ్యులకున్న అవగాహన గురించి ముఖాముఖి ప్రశ్నల ద్వారా అభిప్రాయ సేకరణ జరిపారు. ఈ సందర్భంగా భక్తచరణ్‌దాస్‌ మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని స్పష్టంచేశారు. అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే తుది జాబితాను ఏఐసీసీకి పంపుతామని చెప్పారు. అనివార్య కారణాల వల్ల టికెట్‌ ఇవ్వలేనివారిని తమ వద్దకు పిలిపించుకుని టికెట్‌ ఇవ్వలేకపోవడానికి కారణాలు చెప్పి వారిని ఒప్పించిన తర్వాతే తుది జాబితా తయారు చేస్తామని పేర్కొన్నారు.

శర్మిష్ట ముఖర్జీ మాట్లాడుతూ.. రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో పాలుపంచుకోవడం తనకు ఇదే తొలిసారని, అయినా ఏఐసీసీ తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చుతానని చెప్పారు. జ్యోతిర్మణి మాట్లాడుతూ.. తనకు ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌లో సుదీర్ఘంగా పనిచేసిన అనుభవం ఉందని, ఏఐసీసీ మార్గదర్శకాల ప్రకారం టికెట్ల ఖరారులో తన వంతు పాత్ర పోషిస్తానని పేర్కొన్నారు. అనంతరం స్క్రీనింగ్‌ కమిటీ.. ఒక్కో సభ్యుడిని పలు ప్రశ్నలు అడిగి, వారి అభిప్రాయాలు సేకరించింది. అలాగే టికెట్ల ఖారారులో ఎన్నికల కమిటీ సభ్యులకు ఉన్న అవగాహన గురించి కూడా ముఖాముఖి ప్రశ్నల ద్వారా అభిప్రాయాలు తెలుసుకుంది. ఈ భేటీలో కమిటీ సభ్యులు, ఉత్తమ్‌తో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆర్‌.సి.కుంతియా కూడా పాల్గొన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షులతో సమావేశమైన స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు.. అభ్యర్థుల ఖరారు విషయంలో వారి ప్రాధాన్యతలపై ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టు సమాచారం. కాగా, ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీ.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తో దాదాపు రెండు గంటలపాటు ఏకాంతంగా సమావేశమైంది. 

బీసీలకు ప్రాధాన్యమివ్వాలి: వీహెచ్‌ 
టికెట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యమివ్వాలని మాజీ ఎంపీ వీహెచ్‌ కోరారు. స్క్రీనింగ్‌ కమిటీతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ 20 మంది బీసీలకు పోటీ చేసే అవకాశం ఇచ్చిందని, కాంగ్రెస్‌ పక్షాన కనీసం 30 మందిని బరిలో దింపాలని సూచించారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. పారాచూట్‌ లీడర్లకు టికెట్లిచ్చేది లేదని రాహుల్‌గాంధీనే గతంలో చెప్పారని, ఈ విషయాన్ని స్క్రీనింగ్‌ కమిటీ గమనంలోకి తీసుకోవాలని సూచించినట్టు సమాచారం. అలాగే డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులకు కూడా ఈ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇవ్వాలని ఆయన కోరినట్టు తెలిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement