బాబు మనస్సులోని మాట.. మహాకూటమిలో జనసేన | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 28 2018 6:29 PM

Chandrababu Says Janasena Also Part Of Mahakutami - Sakshi

సాక్షి, ఖమ్మం: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గూటి పక్షేనని మరోసారి స్పష్టమైంది.  ఖమ్మం పట్టణంలో బుధవారం మహాకూటమి నిర్వహించిన భారీ బహిరంగ సభలో చంద్రబాబే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ సభలో మాట్లాడుతూ.. చంద్రబాబు తన మనస్సులోని మాటను బయట పెట్టారు. ‘కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు ఓ సైనికుడిగా తయారు కావాలి. పోలింగ్‌కు ఇంకా ఐదు రోజులే ఉంది.. తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీ, జనసేన.. తెలంగాణ జనసేన, సీపీఐ, అందరు కార్యకర్తలు కలవాలి. ఇది మీ బాధ్యత ఎవరూ చెప్పక్కర్లేదు. అందరూ కలిసి ఒకే తాటిపై నిలిచి గెలిపించుకుందామని అందరికి విజ్ఞప్తి చేస్తున్నా’ అని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో జనసేనాని తన మనిషేనని చంద్రబాబు తేల్చేశారు. 

జనసేన పార్టీని స్థాపించడం నుంచి ఇప్పటివరకు చంద్రబాబు ఆదేశాల మేరకు, ఆయన డైరెక్షన్‌లోనే పవన్‌ కల్యాణ్‌ సాగుతున్నారని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలకు సరిగ్గా సంవత్సరం ముందుగా... పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న పర్యటనలు, విమర్శలు కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి తెలుగుదేశం పార్టీకి లబ్ధి కలిగించి పరోక్షంగా సహకరించేందుకేననే విమర్శలు బలపడుతున్నాయి. ఈ తరుణంలో చంద్రబాబు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. 

చదవండి: బాబు గూటి చిలకే పవన్‌ 

Advertisement
Advertisement