విసిగి, వేసారినందుకే వైఎస్ జగన్ వద్దకు: చెవిరెడ్డి
సాక్షి, అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబుది మోసపూరిత పాలన అని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. ఎన్నికల్లో నెగ్గేందుకు 600కు పైగా హామీలిచ్చిన చంద్రబాబు.. సీఎం అయ్యాక ఈ నాలుగేళ్లలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. అనంతపురంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపు, బోయ రిజర్వేషన్లపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. రిజర్వేషన్లను బుట్టదాఖలు చేసేందుకే ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు పాలన వల్ల సమస్యలతో విసిగి, వేసారిన ఏపీ ప్రజలు తమ గోడు చెప్పుకునేందుకు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తోన్న ప్రజాసంకల్పయాత్రకు తరలివస్తున్నారని చెవిరెడ్డి పేర్కొన్నారు.
మరోవైపు కడప, కర్నూలు జిల్లాలో పాదయాత్ర ముగించుకున్న జననేత జగన్.. నేడు అనంతపురం జిల్లాలో ప్రజాసంకల్పయాత్రను మొదలుపెట్టగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జననేతకు ఆత్మీయ స్వాగతం పలికిన జిల్లా ప్రజలు.. చంద్రబాబు పాలనలో తమకు ఎదురైన ఇబ్బందులు, సమస్యలను వైఎస్ జగన్కు వివరిస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వస్తే మీకు ఈ కష్టాలు ఉండవంటూ భరోసా కల్పిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు.