చంద్రబాబు మీకేమైనా నివేదిక ఇచ్చారా? | Bosta satyanarayana Reacts on Local Body Elections Postponed By 6 Weeks | Sakshi
Sakshi News home page

రాష్ట్ర చరిత్రలోనే చీకటి రోజు: బొత్స

Mar 15 2020 8:10 PM | Updated on Mar 15 2020 8:45 PM

Bosta satyanarayana Reacts on Local Body Elections Postponed By 6 Weeks - Sakshi

సాక్షి, విశాఖ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉన్మాదిలా మాట్లాడుతున్నారని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏకపక్ష నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ...గవర్నర్‌ దృష్టికి తీసుకు వెళ్లారని ఆయన తెలిపారు. మంత్రి బొత్స ఆదివారం విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...చంద్రబాబు మాటలు 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిలా లేవు. ఆయనకు రాష్ట్రం, ప్రజలు, రాష్ట్ర అభివృద్ధిపై శ్రద్ధ లేదు. చంద్రబాబుకు సొంత పార్టీ, కుటుంబంపైనే ఎక్కువ శ్రద్ధ. కేంద్ర నిధులు రాష్ట్రానికి రావడం ఆయనకు ఇష్టం లేదు. కొన్ని రోజుల క్రితం అధికార వికేంద్రీకరణ బిల్లుపై చంద్రబాబు మండలి చైర్మన్‌పై ఒత్తిడి తెచ్చి శాసనమండలికి మచ్చ తెచ్చారు. ఇపుడు అలాగే జరిగింది. నాడు మండలి చైర్మన్ అన్నట్టే నేడు రమేష్ కుమార్ విచక్షణాధికారం అంటున్నారు. చంద్రబాబు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో ప్రజలు గమనించాలి. ప్రజలు ఛీ కొట్టినా ఆయనకు‌ బుద్ది రాలేదు.(ఏపీ గవర్నర్తో ముగిసిన సీఎం జగన్ భేటీ)

కరోనా వైరస్‌పై ఎంత అప్రమత్తంగా ఉన్నామో సీఎం జగన్‌ ఇవాళ గవర్నర్‌ను కలిసి వివరించారు. ఎన్నికల కమిషన్‌ దృష్టికి ఏమైనా వస్తే ప్రభుత్వాన్ని వివరణ అడగాలి. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై అధికారులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. కానీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. తనకున్న విచక్షణా అధికారంతోనే ఎన్నికలు వాయిదా వేసినట్లు ఎన్నికల కమిషనర్‌ చెబుతున్నారు. ఈసీ నిర్ణయం రాష్ట్ర చరిత్రలోనే చీకటి రోజు. (రాష్ట్ర ఎన్నికల కమిషనర్పై సీఎం జగన్ ఆగ్రహం)

ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేసే అధికారం ఏ రాజ్యాంగంలో ఉంది. చంద్రబాబు మీకేమైనా నివేదిక ఇచ్చారా? ఇది రాజ్యాంగ పాలనేనా.. ఆయన ఏమైనా రాజా?. కనీసం విచారణ, నివేదిక లేకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఎన్నికల వాయిదాపై కుంటి సాకులు చెబుతూ... రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తాం. చంద్రబాబు, నారా లోకేష్‌ నిర్వాకం వల్లే ఆ పార్టీ నేతలు టీడీపీని వీడుతున్నారు. మాయ, మోసం, దగాతోనే చంద్రబాబు బతుకుతున్నారు. కేవలం చంద్రబాబు మాటకు, గురుదక్షిణగానే..ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహరించారు. ఎన్నికల వాయిదాకు కుంటి సాకులు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ సూపర్ పవర్ కాదు. ఈసీకి కూడా నిబంధనలు వర్తిస్తాయి’ అని అన్నారు. (ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా)

Advertisement
 
Advertisement
Advertisement