‘తప్పుడు ఆరోపణలు చేస్తే నాలుక తెగ్గోస్తాం’

BJP Spokespersons Dasam And Gayathri Slam TDP Leader Rayapati Sambasiva Rao In Vijayawada - Sakshi

విజయవాడ: టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తన వయసుకు తగ్గట్టు ప్రవర్తించాలని బీజేపీ ఏపీ అధికార ప్రతినిథి దాసం ఉమా మహేశ్వరరావు హితవు పలికారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఉమామహేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ రాయపాటి వ్యాఖ్యలను తపుబట్టారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీద అర్ధంపర్ధం లేని వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేస్తే నాలుగ తెగ్గోస్తామని హెచ్చరించారు. రాయపాటి రాజకీయ చరిత్ర ఏంటో ప్రజలందరికీ తెలుసునని అన్నారు.

పొగాకు, మిర్చి, కోల్డ్‌ స్టోరేజీ వ్యాపారంలో రైతుల దగ్గర నుంచి రాయపాటి దోచుకున్నారని ఆరోపించారు. పోలవరం కాంట్రాక్టు దక్కించుకోవడానికి తప్పుడు పత్రాలు సమర్పించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎంపీగా ఉండి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ నాలుగేళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలకు టీడీపీ చేసిందేమీ లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన అస్తవ్యస్తమైందన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. చంద్రబాబుకు జాతీయ రాజకీయాలను శాసించే కెపాసిటీ లేదన్నారు.

ఆ వార్తలో వాస్తవం లేదు: గాయత్రి
కమలంలో కత్తులు పేరుతో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని బీజేపీ ఏపీ అధికార ప్రతినిథి గాయత్రి పేర్కొన్నారు. పార్టీకి రాజీనామా చేసిన వ్యక్తులకు, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. కావాలనే కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారని చెప్పారు. కొత్తగా 52.67 లక్షల ఓట్లు నమోదైనట్లు అధికారులు చెప్పారు..ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు నమోదవడం వెనక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు. గెలవలేక చంద్రబాబు అడ్డదారిలో అధికారంలోకి రావడానికి దొంగ ఓట్లు చేర్చుతున్నారని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో చనిపోయిన వారికి కూడా ఓటు హక్కు వచ్చిందని, ఓటమి భయంతోనే టీడీపీ నేతలు దొంగ ఓట్ల కార్కానాకు తెరలేపారని వ్యాఖ్యానించారు. దీనిపైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top