‘ఓటింగ్ ప్రక్రియలో పాల్గొననివారు అనర్హులే’
బీజేపీపై సిద్ధరామయ్య విమర్శలు
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్ను కూలదోసి అనైతిక, అక్రమ, రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలబోతోందని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య అన్నారు. దొడ్డిదారిన బీజేపీ అధికార పీఠాన్ని సాధించిందని విమర్శించారు. 56 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్-జేడీఎస్ కాకుండా 36 శాతం ఓట్లు సాధించిన బీజేపీ పాలించబోతోందని ఎద్దేవా చేశారు. ప్రజాతీర్పులేని ప్రభుత్వం గద్దెనెక్కాలని చూస్తోందని విమర్శలు గుప్పించారు. రాజ్యాంగంపై నమ్మకం లేకనే బీజేపీ నేతలు ఫిరాయింపులకు స్వాగతం పలికారని అన్నారు. ఎమ్మెల్యేలను గుర్రాల మాదిరిగా కొనుగోలుచేసి రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. మంళవారం జరిగిన ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనని ఎమ్మెల్యేలపై ఫిరాయింపు చట్టం ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వారి గౌర్హాజరుపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గౌర్హాజరైన వారంతా అనర్హులవుతారని చెప్పారు.
‘అనైతిక రాజకీయ అస్థిరత’పై ఆందోళనలు
అధికారమే లక్ష్యంగా ఎమ్మెల్యేలను కొనుగోలుచేసిన బీజేపీ దేశంలో ఎన్నడూ చూడని నీచకార్యానికి పాల్పడిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ‘అనైతిక రాజకీయ అస్థిరత’కు నిరసగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. సంకీర్ణ ప్రభుత్వం కూలడానికి కేంద్రంలో మోదీ సర్కార్, కర్ణాటక గవర్నర్, మహారాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం ఉమ్మడి బాధ్యులని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్ అన్నారు.