ఢిల్లీని ఊపేస్తున్న.. ‘లగే రహో కేజ్రీవాల్‌’

Arvind Kejriwal Releasing Campaign Song For Delhi Elections - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎన్నికల వాగ్ధానాలు, ప్రత్యర్థులపై విమర్శలు, ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా అధికార ఆమ్‌ఆద్మీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఆప్‌ కన్వీనర్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నీ తానై, ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో అమలు చేసిన ప్రజాసంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.  ఓటర్లకు మరింత దగ్గరగా చేరువ అయ్యేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌పై ఆప్‌ ఓ ప్రచార గీతాన్ని విడుదల చేసింది. ‘లగే రహో కేజ్రీవాల్‌’ అంటూ సాగే ఈ ప్రచారం గీతం ఢిల్లీ ప్రజలను విశేషంగా అకట్టుకుంటోంది. దీనిని ఆప్‌ కార్యాలయంలో కేజ్రీవాల్‌, మంత్రులు కలిసి శనివారం విడుదల చేశారు. (తేలని సీఎం అభ్యర్థి.. మోదీపైనే భారం!)

మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న పోలింగ్‌ జరుగనున్న విషయం తెలిసిందే. ఆమ్‌ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య సాగే ఈ పోరులో విజయం కోసం నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. త్రిముఖ పోరు ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నా.. ప్రధాన పోటీ మాత్రం ఆమ్‌, బీజేపీ మధ్య మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. దేశ రాజధాని కావడంతో ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ 67 సీట్లు దక్కించుకోగా.. బీజేపీ మూడు స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్‌ కనీసం ఒక్కస్థానంలో కూడా విజయం సాధించలేదు. (త్రిముఖ పోరులో పీఠం ఎవరిది..?)

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top