
సాక్షి, కాకినాడ: రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న అత్యాచార ఘటనలపై ఏపీ డిప్యూటీ సీఎం, హోంమంత్రి చినరాజప్ప స్పందించారు. దాచేపల్లి, తమ్మయ్యపేట సంఘటనలు చాల సున్నితమైనవని పేర్కొన్నారు. రౌడీలను, దొంగలను గుర్తించగలం, కానీ, ఇవాళ ఇంట్లో ఉండి మోసగించే పరిస్ధితులు వచ్చాయని, నీతి తగ్గిపోయే పరిస్థితి తలెత్తిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటనల నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం రావాలని, నైతికత పెరుగాలని అన్నారు.
యూట్యూబ్ వచ్చాక సెక్స్ అనే అంశం సులువుగా అందుబాటులోకి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. చిన్నపిల్లలు ఇటువంటి వాటికి ఆకర్షితులై చెడ్డదారి పడుతున్నారని అన్నారు. ఇటువంటి వాటిని నియంత్రించి.. ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ఉరిశిక్షలు పడే చట్టాలు వచ్చినా జనం జడవడం లేదని పేర్కొన్నారు. శిక్షలు బలంగా ఉన్నాయని కిందవరకు అవగాహన కల్పిస్తేనే మార్పు వస్తుందని తెలిపారు. తప్పు చేసిన వారు ఏ పార్టీ అయినా లెక్కచేయబోమని, తమకు శాంతిభద్రతలే ముఖ్యమని చెప్పుకొచ్చారు. తప్పు చేసినా వ్యక్తి ఎంత గొప్పవాడైనా తీసుకొచ్చి కేసుపెట్టి అరెస్టు చేస్తామన్నారు.