సాక్షి, అమరావతి: ఎన్నికల వ్యవస్థను సంస్కరించడంలో భాగంగానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నియామకం నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం సవరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికల సంఘాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రాల్లో ఎన్నికల సంఘాలు సమర్థవంతంగా పనిచేయడానికి సంస్కరణలు చేయడం సాధారణ విషయమేనని అభిప్రాయపడ్డారు. ఎస్ఈసీ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో శుక్రవారం ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
► రాజ్యాంగంలోని 243–కె అధికరణ ప్రకారం.. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు, దాని విధివిధానాలు కూడా రూపొందించుకునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.
► చక్కని ప్రజాస్వామ్యం కావాలనే ఎస్ఈసీ పదవీకాలాన్ని ప్రభుత్వం కుదించింది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే గవర్నర్ కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు.
► ఈ ఆర్డినెన్స్తో కొంప కొల్లేరవుతుందని చంద్రబాబు సహా ఇతర పార్టీలు అనవసరంగా గగ్గోలు పెడుతున్నాయి. దీనిపై టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం సరికాదు.
► కరోనా పరిస్థితుల కారణంగా ప్రభుత్వం ఆర్డినెన్స్ను తీసుకువచ్చింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్ఈసీ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదింపుపై చట్టం చేస్తాం.
► ఇది ఎవరినీ టార్గెట్ చేసి చేయలేదు.
► గతంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏకసభ్య కమిషన్గా ఉండేది. తర్వాత దాన్ని ముగ్గురు సభ్యులు ఉండేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
► ఎన్నికలు నిస్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోర్టులు చెప్పాయి. కేంద్రంలో కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు సాఫీగా జరిగేలా చూడాలి.
► ఎస్ఈసీ పదవీ కాలం కుదింపు అన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. దీంతో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు.


