కర్ణాటకం : బీజేపీ గూటికి ఆ 17 మంది ఎమ్మెల్యేలు

All Disqualified MLAs To Join BJP - Sakshi

బెంగళూర్‌ : అనర్హత వేటుకు గురైన 17 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలు గురువారం బీజేపీలో చేరతారని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో వారికి బీజేపీ టికెట్లను కట్టబెట్టనున్నారు. పార్టీ అగ్రనాయకత్వంతో సంప్రదించి వారికి టికెట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు రెబెల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటును సమర్ధించిన సుప్రీం కోర్టు డిసెంబర్‌ 5న జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వారు అర్హులేనని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పును స్వాగతించిన యడియూరప్ప రెబెల్‌ ఎమ్మెల్యేలు కాషాయ తీర్ధం పుచ్చుకుంటారని చెప్పారు.

వచ్చే నెలలో ఎన్నికలు జరిగే 15 నియోజకవర్గాల్లో గురువారం నుంచి ఎన్నికల ప్రచారం చేపడతామని యడియూరప్ప తెలిపారు. అన్ని సీట్లలో తాము విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా బీజేపీకి ఏమాత్రం నైతిక విలువలు మిగిలిఉన్నా అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వరాదని కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ దినేష్‌ గుండూరావు వ్యాఖ్యానించారు. మరోవైపు తామంతా గురువారం బీజేపీలో చేరతామని అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యే రమేష్‌ జర్కిహోలి ధ్రువీకరించారు. ఇక కర్ణాటక ఉప ఎన్నికల నామినేషన్ల గడువును పెంచినట్టు ఈసీ పేర్కొంది, ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి సుప్రీం తీర్పు నేపథ్యంలో వారు పోటీ చేసేందుకు అవకాశం ఇస్తూ ఈ వెసులుబాటు కల్పించింది. ఈనెల 18 వరకూ నామినేషన్లను స్వీకరిస్తారని ఈసీ పేర్కొంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top