‘మోదీని అడుగుపెట్టనివ్వం’
గువహటి: పౌరసత్వ (సవరణ) బిల్లును లోక్సభ ఆమోదించడంపై అస్సాంలో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. అనేక చోట్ల ప్రజలు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, కళాకారులు, సాహితీవేత్తలు, మేధావులు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉన్న అస్సాం గణపరిషత్ (ఏజీపీ)కి చెందిన మంత్రులు బుధవారం తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రభుత్వం నుంచి ఏజీపీ రెండ్రోజుల క్రితమే బయటకు రావడం తెలిసిందే. బుధవారం పలుచోట్ల ఆందోళనకారులు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి సోనోవాల్ తదితరుల దిష్టిబొమ్మలను కాల్చారు. సచివాలయాన్ని ముట్టడించారు. మోదీ, ఇతర కేంద్ర మంత్రులను అస్సాంలో అడుగుపెట్టనివ్వబోమనీ, అలాగే ముఖ్యమంత్రి, ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్రంలో ఎక్కడా సభలు, ర్యాలీలు నిర్వహించకుండా అడ్డుకుంటామని కృషక్ ముక్తి సంగ్రామ సమితి అధ్యక్షుడు అఖిల్ గొగోయ్ ప్రకటించారు. 70 సంస్థలు సచివాలయం వద్ద ఆందోళనలు చేశాయి.
సంబంధిత వార్తలు