అమెరికాలో ప్రపంచ తెలుగు మహా సభల సన్నాహక సదస్సు | World Telugu Conference preparation meetings held in Atlanta, California | Sakshi
Sakshi News home page

అమెరికాలో ప్రపంచ తెలుగు మహా సభల సన్నాహక సదస్సు

Nov 22 2017 7:52 AM | Updated on Nov 22 2017 7:52 AM

 World Telugu Conference preparation meetings held in Atlanta, California - Sakshi

హైదరాబాద్లో డిసెంబర్ 15 నుండి 19 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి సన్నాహక సదస్సులను వివిద దేశాల్లొ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సన్నాహక సదస్సును అట్లాంటాలో జరిపారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో తెలంగాణా సాహిత్య అకాడమి పక్షాన.. ప్రపంచ తెలుగు మహా సభల ప్రవాస భారతీయ శాఖల సమన్వయకర్త మహెష్ బిగాల ముఖ్య అతిథిగా అట్లాంటాకి వచ్చి ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా ఆహ్వానం పలికారు. దీప ప్రజ్వలన అనంతరం చదువులతల్లి సరస్వతి అమ్మవారిపై  మీనక్షి రామడ్గు పాడిన పాటతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది.

ముఖ్య అతిథి మహెష్ బిగాల మాట్లాదుతూ, కేసీఆర్‌కి తెలుగు బాష పై ఉన్న మమకారం, సాహిత్యం మీదున్న ఆసక్తి గురించి వివరించారు. తెలుగు బాషను కాపాడటానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల గురించి చెప్పారు. తెలుగు బాష అందరిదని, భాషా పండితులు ఎక్కడివారైనా గౌరవించాల్సిన బాధ్యత మన అందరిమీద ఉన్నదని అన్నారు. అమెరికా, వివిద దేశాల నుండి వచ్చే వారికి ప్రభుత్వం కల్పించనున్న సదుపాయాలను వివరించారు. తర్వాత ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ ద్వారా ప్రపంచ తెలుగు మహా సభల ఉద్దేశాన్ని వివరించారు. ఈ సదస్సుకు అట్లాంటా నగరం, చుట్టు పక్కల ప్రాంతాలనుండి తెలుగు భాషా పండితులు, సాహితీ వేత్తలు, భాషా ప్రేమికులు, అన్ని తెలుగు సంఘాల నాయకులు పాల్గొని సభను విజయవంతం చేశారు.

ప్రముఖ సంస్కృతాంధ్రపండితులు బాబు దేవీదాస్ శర్మ మాట్లాడుతూ, తెలుగు సాహిత్యం ఎంతో ప్రాఛీనమైనదని కొండాపూరు నందు లభ్యమైన శాసనాలను ఉటంకిస్తూ చెప్పారు. అలాగే తెలంగాణాలోని ఎన్నో సంస్థానాలు కవిపండితులను పోషించాయని అందులో గద్వాల సంస్థానం చాలా ప్రముఖమైనది చెబుతూ, గద్వాల సంస్థానములో జరిగిన  శతావధానములోని పద్యాలను ఉదహరించారు. అనంతరం ప్రముఖ సాహితీ పరిశోధకుడు, రచయిత సురేష్ కొలిచాల మాట్లాడుతూ, తెలుగుభాష నేడు ఎంతోమంది మాట్లాడుతున్నప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో మన భాషకు ఇంకా సముచితమైన స్థానం దక్కలేదని, భాషను పరిరక్షించుకునే దిశగా మనమంతా అడుగులు వేయాలని, లేకపోతే మన భాష అనేక ఇతర దేశాలలోని భాషలాగే అంతరించే ప్రమాదం ఉందన్నారు. భాషా పరిరక్షణ , వ్యాప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన కార్యక్రమాన్ని ప్రశంసించారు.  తరువాత కవి, రచయిత ఫణి డొక్కా మాట్లాడుతూ తాను సాహితీ కర్షకుడనని చెబుతూ, తాను రాసిన కొన్ని చక్కని వృత్తపద్యాలను వినిపించారు. ఇంటర్మీడియెట్ వరకు తెలుగు బోధించాలి అని తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, తెలుగు భాషను కాపాడుకోవడంలో కేసీఆర్‌ చూపుతున్న చిత్తశుద్దిని కొనియాడారు. అమెరికన్ తెలుగు సంఘం అధ్యక్షులు కరుణాకర్ ఆసిరెడ్డి మాట్లాడుతూ, ఇది చాలా మంచి కార్యక్రమం అని, తనతోపాటు దాదాపు 30 మంది సంఘ సభ్యులు హాజరవుతారని తెలిపారు.

తానా కార్యదర్శి అంజయ్య చౌదరి మాట్లాడుతూ భాష విషయంలో సహాయ సహకారాలందించడం కొరకు తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. తానా పక్షాన 20 మంది వరకు హాజరవుతారని తెలిపారు. టాటా  పక్షాన భరత్ మాదాడి మాట్లాడుతూ.. సంఘం నాయకులందరూ కార్యక్రమనికి హాజరవుతారని తెలిపారు. ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా చైర్మన్, ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అనిల్ బొద్దిరెడ్డి, నాటా పక్షాన కిరణ్ కందుల, గేట్స్ పక్షాన నందా చాట్లా, తామా పక్షాన వెంకట్ మీసాల, గాటా పక్షాన గురు, ఎన్నారై విఏ పక్షాన రాము, గణెష్ కాసం, సింగర్‌ శ్రీనివాస్ దుర్గం, ఆటా సాంస్కృతిక  శాఖ నుండి ఉదయ ఏటూరు, జానపద గాయకుడు  జనార్థన్‌ పన్నెల, విటి సేవ పక్షాన సంధ్య యెల్లాప్రగడతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో రామడ్గు శివకుమార్, నిరంజన్ పొద్దుటూరిలు తమవంతు కృషి చేశారు.
        
తెలుగు మహాసభల సన్నాహక సదస్సుకు కాలిఫోర్నియాలో భారీ స్పందన

తెలుగు భాష, సాహితీ వైభవాన్ని ప్రపంచమంతా చాటేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను ప్రవాసులు విజయవంతం చేయాలని మహాసభల ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బీగాల కోరారు. తెలుగు మహాసభల సన్నాహక సదస్సును కాలిఫోర్నియాలోని బే ఏరియాలో నిర్వహించారు. విజయ్ చవ్వా, పూర్ణ బైరి లు సమన్వయకర్తలుగా నిర్వహించిన ఈ సన్నాహక సదస్సు కు మహాసభల ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బీగాల ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచమంతా పర్యటిస్తూ ఈ మహాసభలకు తెలుగు వారిని, సాహితీ ప్రియులను, తెలుగు భాషాభిమానులకు ఆహ్వానిస్తున్నట్టు అయన చెప్పారు. తెలుగు జాతి సీఎం కేసీఆర్  కు రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీసీఏ టీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ, సిలికాన్ ఆంధ్ర, బాటా, వీటీఏ ,టీడీఎప్‌, టాటా, సాన్‌ రామన్‌ ఫ్రెండ్స్‌, ఎస్‌టీఏ, తెలంగాణ జాగృతి హెచ్‌ఎస్‌ఎస్‌ సంఘాల ప్రతినిధులు, తెలుగు రచయతలు, కళాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement