మే4న డాలస్‌లో ప్రవాస భారతీయోత్సవం

Indian American Festival in Dallas - Sakshi

డాలస్‌ : ‘ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్’ ఆధ్వర్యంలో డాలస్‌లో ప్రవాస భారతీయోత్సవ కార్యక్రమం జరగనుంది. “భారతీయులందరూ అమెరికా జనజీవన స్రవంతిలో భాగం కావాలి” అనే పిలుపునిస్తూ కాప్పెల్‌లోని సైప్రేస్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర ఓ ప్రకటన విడుదల చేశారు. మే4న మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, పార్కింగ్‌తో సహా ప్రవేశం ఉచితమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లల వినోదం కోసం ‘పెట్టింగ్ జూ’, ‘పోనీ రైడ్స్’,  ‘స్టిల్ట్ వాకర్స్’, ‘ఫేస్ పెయింటింగ్’, ‘మెహంది’, ‘బౌన్సు హౌస్’, ‘రంగు రంగుల బెలూన్స్ పంపకం’ మొదలైనవెన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథుల కోసం వివిధ రకాల వంటకాలతో కూడిన ఫుడ్ స్టాల్స్, ఇతర బిజినెస్ స్టాల్స్ అందుబాటులో ఉండనున్నాయి. 500 మందికిపైగా భారత సంతతికి చెందిన వారితో పాటు అమెరికన్ యువతీయువకులు కూడా అనేక సంగీత, నృత్య కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. 80 మందితో కూడిన విద్యార్ధినీ విద్యార్ధులు “కాప్పెల్ స్కూల్ బ్యాండ్”లో అలరించనున్నారు.      

“అమెరికా గాట్ టాలెంట్” షో కు సెలెక్ట్ అయిన హైదరాబాద్‌కు చెందిన క్రాంతి కుమార్ అనే యువకుడు చూపుడు వేలుతో కొబ్బరికాయకు రంధ్రం చేసి కొబ్బరి నీళ్ళు త్రాగడం, రక్తస్రావం లేకుండా ముక్కులో డ్రిల్ బిట్ ఆన్ చేసి పెట్టుకోవడం, సల సలా మరిగే నూనెను చేతులతో త్రాగడం, 32 పొడవాటి కత్తులను గొంతులో దించుకోవడం, చెక్క ముక్కపై నుదిటితో మేకు కొట్టడం లాంటి అనేక సాహస కృత్యాలను ప్రదర్శించనున్నారు. పాటలను రివర్స్‌లో పాడే ప్రక్రియతో కొన్ని వందల కార్యక్రమాలుచేసి ఎన్నో ప్రశంసలు పొందిన “రివర్స్ గేర్ గురుస్వామి” అందర్నీ అలరించడానికి ప్రత్యేకంగా వస్తున్నారు.

భారత సంతతికి చెందిన యూ.ఎస్ కాంగ్రెస్ మెంబర్ రాజా కృష్ణమూర్తి, నార్త్ కరోలిన స్టేట్ సెనెటర్ జై చౌదరి, వాషింగ్టన్ స్టేట్ సెనెటర్ మాంకా డింగ్ర, ఒహాయో స్టేట్ రిప్రెసెంటేటివ్ నీరజ్ అంటాని, మేరీలాండ్ స్టేట్ రిప్రెసెంటేటివ్ జై జలిసి, ఆరిజోనా స్టేట్ రిప్రెసెంటేటివ్ డా. అమిష్ షాతో పాటు టెక్సస్ స్టేట్ రిప్రెజెంటేటివ్స్ మిషల్ బెక్లీ, జూలీ జాక్సన్, టెర్రీ మిజా, మ్యాట్ షాహీన్ హాజరుకానున్నారు. ఇండియన్ ఎంబసీ నుండి కమ్యూనిటీ అఫైర్స్ మినిస్టర్ అనురాగ్ కుమార్, కాన్సులేట్ జనరల్ అఫ్ ఇండియా, హ్యుస్టన్ నుండి కాన్సల్ రాకేష్ బనాటి, విప్రో సంస్థ సీఈఓ అబిద్ ఆలి నీముచ్వాలా, కాప్పెల్ నగర పోలీస్ చీఫ్ డానీ బార్టన్, కాప్పెల్ స్కూల్ డిస్ట్రిక్ట్ సూపరిండేంట్ బ్రాడ్ హంట్, నగర కౌన్సిల్ మెంబర్ బిజూ మాత్యూ ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నారు. 

అర్హత కల్గిన ప్రవాస భారతీయులందరూ అమెరికా దేశ ఎన్నికల్లో పాల్గొనేందుకు వీలుగా ఓటు హక్కును నమోదు చేసుకోవడానికి ఈ ఉత్సవంలో అవకాశం కల్పిస్తున్నాము. రాత్రి 9 గంటలకు కనుల విందు కల్గించే అత్యంత వైభవంగా ఫైర్ వర్క్స్ ఉంటాయి. సంస్థ అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర నేతృత్వంతో కూడిన బోర్డు అఫ్ డైరెక్టర్స్ జాన్ హేమండ్, రావు కల్వల, తైయబ్ కుండావాల, డా. చెన్నుపాటి రావు, పియూష్ పటేల్, మురళి వెన్నం, డా. సత్ గుప్తా, రన్నా జానీ, రామ్ కీ చేబ్రోలు, ప్రొఫెసర్. నిరంజన్ త్రిపాఠి వివిధ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top