లారీ, బైక్‌ ఢీ: ఒకరి మృతి

man dies in lorry accident in nizamabad - Sakshi

నిజాంసాగర్‌: ఎదురుగా వస్తున్న బైక్‌ను చెరుకు లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీ కొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని మాగి గ్రామానికి చెందిన గుర్రపు అనిల్‌(35), చింతకింది శేఖర్‌(34)ఆదివారం నారాయణఖేడ్‌లో తమ బంధువుల ఇంటికి బైక్‌పై వెళ్తుండగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం నిజాంపేట సమీపంలోని బొక్కలకుంట దర్గా వద్ద మూల మలుపు వద్ద చెరుకు లోడ్‌తో నారాయణఖేడ్‌ వైపు నుంచి వెళ్తున్న లారీ ఢీకొంది.

దీంతో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. వారి బైక్‌ నుజ్జయింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నిజాంపేట సర్పంచ్‌ సాయిరెడ్డి హుటాహుటిని అక్కడికి చేరుకుని 108 అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. వారిని నారాయణఖేడ్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో గాయాలైన అనిల్, శేఖర్‌కు పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. జోగిపేట సమీపంలోకి చేరుకునే సరికి అనిల్‌ మృతిచెందాడు. దీంతో శేఖర్‌ను హైదరాబాద్‌కు తరలించారు. మృతిచెందిన అనిల్‌కు భార్య, ఇరువురు పిల్లలు ఉన్నారు. బైక్‌ను ఢీకొట్టిన చెరుకు లారీని నిజాంపేట వద్ద గ్రామస్తులు ఆపి వేశారు. నారాయణఖేడ్‌ ఎస్‌ఐ నరేందర్‌ సిబ్బంది ద్వారా వివరాలు తెలుసుకున్నారు.

 

Read latest Nizamabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top