తన ఇంటి ముందు బైక్‌పై వెళుతున్నాడని.. | Village Sarpanch Thrashes Dalit Man For Riding Bike | Sakshi
Sakshi News home page

తన ఇంటి ముందు బైక్‌పై వెళుతున్నాడని..

Jun 25 2018 6:57 PM | Updated on Oct 8 2018 3:19 PM

Village Sarpanch Thrashes Dalit Man For Riding Bike  - Sakshi

సాక్షి, భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. దళిత యువకుడు తమ ఇంటి ముందు బైక్‌పై వెళుతుండటాన్ని తట్టుకోలేని గ్రామ సర్పంచ్‌ మరో నలుగురు కలిసి అతడిని తీవ్రంగా గాయపరిచారు. తికంఘర్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈనెల 21న తాను బైక్‌పై వెళుతుండగా గ్రామ సర్పంచ్‌ హేమంత్‌ కుర్మీ, అతని సోదరులు, ఇతరులు తనను అడ్డుకుని బైక్‌పై నుంచి తోసివేశారని, తనను దారుణంగా కొట్టారని దయారాం అహిర్వార్‌ (30) పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులు హేమంత్‌ కుర్మీ, ఆయన సోదరులు వినోద్‌ కుర్మీ, మున్ను కుర్మీ, అనిరుధ్‌ కుర్మీ, మరో నిందితుడు దినేష్‌ యాదవ్‌లను అరెస్ట్‌ చేశామని స్థానిక ఏఎస్‌ఐ రామ్‌సేవక్‌ ఝా తెలిపారు. తమ ఇంటి ముందున్న రోడ్డుపై బైక్‌పై వెళ్లవద్దని నిందితుడు తనను హెచ్చరించాడని అహిర్వార్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంటి ముందు బైక్‌పై వెళ్లకుండా తోసుకుంటూ వెళ్లాలని సలహా ఇచ్చాడని చెప్పారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement