దండకారణ్యంలో కందకాలు | the trenches in Dandakaranya | Sakshi
Sakshi News home page

దండకారణ్యంలో కందకాలు

Nov 28 2015 8:03 PM | Updated on Aug 21 2018 6:12 PM

దండకారణ్యంలో మావోయిస్టులు భారీ స్థాయిలో కందకాల తవ్వకం చేపట్టారు.

  దండకారణ్యంలో మావోయిస్టులు భారీ స్థాయిలో కందకాల తవ్వకం చేపట్టారు.  పోలీసులు ఏర్పాటు చేసే బేస్ క్యాంపులను అడ్డుకోవడంలో భాగంగానే వ్యూహాత్మకంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు ఈ ప్రాంతంలో మూడు బేస్ క్యాంపులను ఏర్పాటు చేయడంతో.. మావోయిస్టులు తమ స్ధావరాలను సేఫ్ జోన్ లుగా మార్చుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరిన్ని బేస్ క్యాంపులు ఏర్పాటు కాకుండా.. ఇప్పటికే ఏర్పాటు చేసిన క్యాంపులకు సరఫరాలు అందకుండా ఉండేందుకే ఇదంతా చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా మరో వైపు డిసెంబర్ నెలలో ఏటా జరిగే పీఎల్ జీఏ వారోత్సవాల నిర్వహణలో భాగంగానే.. ముందు జాగ్రత్త చర్యగా కందకాల ఏర్పాటు జరుగుతోందనే వాదన కూడా వినిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని కుంట, కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలోని అమ్మపేట - పాలచల్మ మధ్యలో శుక్రవారం రాత్రి నుంచి మావోయిస్టులు రోడ్డుమార్గంలో కందకాల  తవ్వకాలు మొదలుపెట్టారు. దండకారణ్య నేత సుధాకర్ నేతృత్వంలో వందలాది మంది మిలీషియా సభ్యులు ఇందులో పాల్గొన్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ రహదారిపై దాదాపు పది నుంచి పదిహేను కందకాలు తవ్వినట్లు తెలుస్తోంది.

రెండునెలల క్రితం పైడిగూడెం అటవీ ప్రాంతంలోని రహదారిపై మావోయిస్టులు 20 కిపైగా కందకాలు తవ్వారు. ఆ తర్వాత మావోయిస్టు విలీన వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. డిసెంబర్2 నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టు పీఎల్‌జీఏ వారోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వారోత్సవాల కోసమే కందకాలు తవ్వారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement