
తెలంగాణ నోట్ ఇంకా రెడీ కాలేదు: హోం మంత్రి షిండే
తెలంగాణ రాష్ట్ర అంశానికి సంబంధించి నోట్ ఇంకా సిద్ధం కాలేదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు.
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అంశానికి సంబంధించి నోట్ ఇంకా సిద్ధం కాలేదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు. టీ.నోట్ సిద్దమైందని ఇక కేబినెట్ కు రేపో మాపో పంపుతామని రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించిన షిండే మాట మార్చారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో షిండే సోమవారం మీడియాతో మాట్లాడారు.తెలంగాణపై నోట్ ఇంకా రెడీ కాలేదని, కేవలం డ్రాఫ్ట్ మాత్రమే వచ్చిందన్నారు. తుది నోట్ ఇంకా సిద్ధం కాలేదన్నారు. తెలంగాణ నోట్ తన దగ్గరకు సంతకం కోసం రాగానే ఆ విషయాన్నిమీడియాకు చెబుతానాని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర కేబినెట్కు హోంశాఖ సమర్పించాల్సిన ముసాయిదా నోట్ సిద్ధమైందని గతంలో హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ముసాయిదా ప్రతిని తాను ఇంకా పరిశీలించలేదని చెప్పారు. ‘‘అధికారులు నోట్ సిద్ధం చేశారు. అయితే నేను ఇంకా చూడలేదని తెలిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలు బుధవారం ఆంటోనీ కమిటీ సభ్యులైన వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్లతో చర్చలు జరిపిన అనంతరం రాష్ట్ర విభజనకు సంబంధించి కీలకాంశాలన్నింటిపై ఏకాభిప్రాయం వచ్చే వరకు ప్రభుత్వపరంగా తెలంగాణ ప్రక్రియ ముందుకెళ్లడం సాధ్యపడకపోవచ్చని వారు కూడా అభిప్రాయపడ్డారు.
ఆ మరుసటి రోజే ముసాయిదా నోట్ సిద్ధమైందని హోంమంత్రి ప్రకటించి సీమాంధ్ర నేతల్లో అలజడి రేపారు. దీంతో హస్తిన బాట పట్టిన నేతలు తెలంగాణ నోట్ అంశాన్ని పదే పదే ప్రస్తావించడంతో షిండే పెదవి విప్పారు. టీ.నోట్ ఇంకా సిద్ధం కాలేదని సీమాంధ్ర నేతలకు కాస్త ఊరట కల్గించారు.