నిర్భయ కేసు: పవన్‌ గుప్తా రివ్యూ పిటిషన్‌ కొట్టివేత

Supreme Court Dismisses Nirbhaya Convict Pawan Gupta Review Petition Over Juvenile - Sakshi

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. నిర్భయ సామూహిక అత్యాచారం జరిగిన సమయంలో తాను మైనర్‌ను అని వేసిన పిటిషన్‌ను కొట్టివేయడాన్ని సమీక్షించాలంటూ.. పవన్‌ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్‌ రివ్యూ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్‌ ఆర్‌ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం.. దానిని కొట్టివేసింది. కాగా ఢిల్లీ కోర్టు తీర్పు మేరకు నిర్భయ దోషులు ముకేశ్‌ సింగ్‌, అక్షయ్‌ ఠాకూర్‌,  పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే.(మొన్న ముఖేష్‌.. నిన్న వినయ్‌ శర్మ.. నేడు అక్షయ్‌)

ఈ నేపథ్యంలో శిక్ష నుంచి తప్పించుకునేందుకు, ఉరి అమలును వాయిదా వేసేందుకు దోషులు అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. వరుస పిటిషన్లు దాఖలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. అదే విధంగా ఒకరి తర్వాత ఒకరు రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతున్నారు. ఈ క్రమంలో వినయ్‌ శర్మ తాజాగా క్షమాభిక్ష అభ్యర్థించిన నేపథ్యంలో మిగిలిన ముగ్గురు దోషులను ఉరితీసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కాగా ఏడేళ్ల క్రితం దేశ రాజధానిలో కదులుతున్న బస్సులో ఓ యువతిపై ఆరుగురు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి గురిచేసి దారుణంగా హింసించగా.. సింగపూర్‌లో చికిత్స పొందుతూ ఆమె మరణించిన విషయం విదితమే. ఈ కేసులో ప్రధాన దోషి రామ్‌ సింగ్‌ జైలులో ఆత్మహత్య చేసుకోగా.. ఘటన నాటికి మైనర్‌గా ఉన్న మరో నిందితుడు విడుదలయ్యాడు.(నిర్భయ కేసు : ఉరి అమలు ఆ ముగ్గురికే..!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top